2017లో చివరి ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్లు, ఆర్కామ్ షేర్ల భారీ ర్యాలీ
ముంబై: ఒకవైపు పాత ఏడాది 2017లో చివరి ట్రేడింగ్, మరోవైపు కొత్త ఏడాది తొలి నెలకు చెందిన డెరివేటివ్ కాంట్రాక్ట్లకు ప్రారంభం.. వెరసి స్టాక్ మార్కెట్లకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఈ ఏడాదిలో చివరి శుక్రవారం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ నుంచి లాభపడుతూ వచ్చిన మార్కెట్లు, చివరికి మంచి లాభాలను అందుకున్నాయి.
సెన్సెక్స్ చివరిలో 200 పాయింట్లు అధిగమించి, 209 పాయింట్ల లాభంలో 34,057 వద్ద ముగిసింది. నిఫ్టీ 53 పాయింట్ల ర్యాలీ జరిపి 10,530.7 వద్ద ముగిసింది. అనిల్ అంబానీకి చెందిన ఆర్కామ్ ఆస్తులను రిలయన్స్ జియో దక్కించుకోబోతుందన్న వార్తలతో ఆర్కామ్ షేర్లు భారీగా ర్యాలీ కొనసాగించాయి.
ట్రేడింగ్ ప్రారంభంలోనే 35 శాతం లాభపడిన ఆర్కామ్ షేర్లు, చివరికి కాస్త తగ్గి 28 శాతం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు 40 శాతం జంప్ చేసింది. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ కూడా 52 వారాల గరిష్టంలో ట్రేడ్ అయింది.