EPFO: అక్టోబర్ 31 వరకే ఛాన్స్, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే స్పెషల్ స్కీమ్!
దేశంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ - ఈపీఎఫ్ఓ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ పరిధిలోకి రాని ఉద్యోగులను ఈ పథకంలో చేర్పించేందుకు వీలుగా 'ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ - 2026' పేరుతో ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది. జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా సంస్థలు తమ పాత రికార్డులను క్రమబద్ధీకరించుకోవడానికి ఒక అరుదైన అవకాశం లభించింది. 2009 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో ఉద్యోగంలో చేరి పిఎఫ్ సౌకర్యం పొందని అర్హులైన ఉద్యోగులందరినీ నమోదు చేసేందుకు ఈ ప్రత్యేక గవాక్షాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ప్రత్యేక ప్రచారం అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం సంస్థలో చురుగ్గా పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను నమోదు చేయడం ద్వారా పిఎఫ్, పెన్షన్ , ఇన్సూరెన్స్ ప్రయోజనాలను వారికి అందించవచ్చు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే క్రమంలో సంస్థలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక మినహాయింపులు కూడా ప్రకటించింది. గతంలో మినహాయించని ఉద్యోగి వాటా చందాను మినహాయించడం ఇందులో ప్రధానమైనది.

డిజిటల్ పద్ధతిలోనే ప్రక్రియ: ఉమాంగ్ యాప్ తప్పనిసరి
నమోదు ప్రక్రియ మొత్తం వేగంగా, పారదర్శకంగా జరిగేందుకు డిజిటల్ విధానాన్ని తప్పనిసరి చేశారు. యజమానులు సంబంధిత ఆన్లైన్ పోర్టల్ ద్వారానే ఈ వ్యవహారాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. నమోదు చేసే ప్రతి ఉద్యోగికి ఉమాంగ్ (UMANG) మొబైల్ అప్లికేషన్ ద్వారా 'ఫేస్ అథెంటికేషన్' పద్ధతిలో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయించాలి. ఆ తర్వాత విధిగా ఈసీఆర్ (ECR) ప్లాట్ఫామ్ ద్వారా చందాలను జమ చేయాల్సి ఉంటుంది.
కార్పొరేట్, కార్మిక రంగానికి రెట్టింపు మేలు
ఈ ప్రచారం కంపెనీలకు, ఉద్యోగులకు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. తమ వద్ద ఉన్న వేతన , ఉద్యోగుల రికార్డులను అంతర్గతంగా పరిశీలించుకుని, అర్హులైన వారిని వెంటనే గుర్తించాలని సంస్థలకు సూచించింది. ఇక ఈ పథకంపై స్పష్టత ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు , ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. సమయం తక్కువగా ఉన్నందున అక్టోబర్ 31 లోపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు యజమానులను కోరుతున్నారు.














Click it and Unblock the Notifications