ఎరిక్సన్కు రూ.550కోట్లు చెల్లించండి: అనిల్ అంబానీ ఆర్కామ్కు తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: స్వీడన్ కంపెనీ ఎరిక్సన్కు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) డిసెంబర్ 15లోపు రూ.550కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేగాక, ఇకపై గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
550కోట్లు చెల్లించాలి! అనిల్ అంబానీని దేశం విడిచివెళ్లనీయొద్దు: సుప్రీంలో ఎరిక్సన్ పిటిషన్
సెప్టెంబర్ 30లోపు 12శాతం వడ్డీ రూ.550 కోట్లను చెల్లించాలని ఇంతకుముందు కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆర్కామ్ డబ్బు చెల్లించకపోవడంతో మరోసారి గడువు పెంచింది. ఆర్కామ్ అధినేత అనిల్ అంబానీ, మరో ఇద్దరు సీనియర్ అధికారులు దేశం విడిచి పోకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎరిక్సన్ గతంలో పిటిషన్ దాఖలు చేసింది.
తమకు ఉద్దేశ పూర్వకంగానే అంబానీ డబ్బులు చెల్లించడం లేదని ఆరోపించింది. ఆర్కామ్ ఇకపై ఆస్తులు విక్రయించేందుకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. కాగా, తమ ఆస్తుల అమ్మకానికి టెలికాం శాఖ అనుమతి రాగానే ఎరిక్సన్కు డబ్బు చెల్లిస్తామని ఆర్కామ్ కోర్టుకు తెలిపింది.
అనుమతి విషయం తమ పరిధిలో లేదని తెలిపింది. స్పెక్ట్రమ్ను విక్రయానికి నిరభ్యంతర పత్రం ఇచ్చిన వారం రోజుల్లో నగదు చెల్లిస్తామని వెల్లడించింది. కాగా, ఇప్పటికే విక్రయించిన ఆస్తుల ద్వారా ఆర్కామ్కు రూ.5000కోట్లు వచ్చాయని ఎరిక్సిన్ తెలిపింది. తమకు ఆలస్యంగా డబ్బు చెల్లించాలనే ఆర్కామ్ టెలికాం అనుమతి అంటూ మెలిక పెడుతోందని ఆరోపించింది.