బ్యాంకులకు మొండి బాకీల గుదిబండ: రూ.9.5 లక్షల కోట్లకు ఎన్పీఏలు
న్యూఢిల్లీ: మద్యం వ్యాపారి విజయ్ మాల్య.. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం వద్ద పారిశ్రామిక అవసరాల పేరిట రూ.9000 కోట్లు రుణం తీసుకున్నారు. కానీ వాటి బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకుల ఫిర్యాదు మేరకు పోలీసులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తదితర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల ఆధారంగా అరెస్ట్ చేసే సంకేతాలు వెలువడటంతో దేశాన్నీ వీడారు. లండన్లో తల దాచుకున్నారు. విజయ్ మాల్య అక్కడే ఉండటానికి ప్రాధాన్యం ఇస్తున్నా, అప్పగింత ఒప్పందం కింద భారత్, బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఇలా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారడంతో భారత బ్యాంకుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మార్చి నాటికి బ్యాంకులను పీడిస్తున్న నిరర్థక ఆస్తులు రూ.9.5లక్షల కోట్లకు చేరవచ్చని అసోచామ్-క్రిసిల్ నివేదిక పేర్కొంది.
రూ.1.5 లక్షల కోట్లకు పెరిగిన బ్యాంకుల నిరర్దక ఆస్తులు
గత ఏడాది ఇదే కాలంలో రూ.8లక్షల కోట్లుగా ఉన్న ఎన్పీఏలు ఈసారి ఆందోళనకర స్థాయిలో మరో రూ.లక్షన్నర కోట్లు పెరిగాయి. దీంతో రుణాలు ఎగవేసిన సదరు కంపెనీ యాజమాన్య హక్కులను బదాలయించుకునే అవకాశం బ్యాంకులకు లభిస్తోంది. కానీ, రుణాల్లో చాలా వరకు ఎన్పీఏ రూపంలో ఉంటే బ్యాంకుల మూలధనంపై ఒత్తిడి పెరిగే ప్రమాదముంది. మార్చి 2018 నాటికి మొత్తం రుణాల్లో 10.5శాతం ఎన్పీఏల్లో చిక్కుకుపోయాయి. వీటికి ఎన్పీఏలుగా మారడానికి దాదాపు సిద్ధంగా ఉన్న ఆస్తులను కూడా కలిపితే రూ.11.5లక్షల కోట్లకు చేరతాయి. ఒత్తిడిలో ఉన్న ఆస్తులను విక్రయించాలంటే బ్యాంకులకు మరో భయం పట్టుకుంది.
అసాధ్యంగా బ్యాంకుల మొండి బకాయిల వసూళ్లు
వేలంలో సంబంధిత సంస్థల ఆస్తులు అనుకున్న దాని కంటే తక్కువ మొత్తానికి అమ్ముడు పోతే ఆ నష్టం బ్యాంకులపై పడుతుంది. ఫలితంగా మూలధన అవసరాలు మరింత పెరిగిపోతాయి. మరోపక్క రుణాలు ఎగ్గొట్టిన కంపెనీల ఆస్తులను పునః మూల్యాంకనం చేస్తే వాటి మూలధనం ఇచ్చిన రుణానికి సరిపడా రావడంలేదు. దీంతో వాటిని విక్రయిస్తే బ్యాంకులకు నష్టాలు మిగులుతాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థల్లోకి కొత్త పెట్టుబడిదారుల్ని తేవడం.. వాటి వ్యాపారాలను జాగ్రత్తగా విస్తరించడం.. మరిన్ని నిధులను వెచ్చించి వ్యాపారాలను అభివృద్ధి చేస్తే తప్ప బ్యాంకులకు రుణ నిధులు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రుణాలు ఎగ్గొట్టిన కంపెనీలను బ్యాంకులు గాడినపెట్టి వ్యాపారం చేసుకొని లాభాలు పొంది రుణాలు చెల్లు వేసుకోవాలి. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు.
ఎన్పీఏల వసూలుకు బ్యాంకులకు అధికారాలిచ్చే చాన్స్
ప్రస్తుతం మొత్తం మొండి బకాయిలలో 40శాతం వాటా ఉన్న 50 కంపెనీలు కేవలం మూడు ప్రధాన రంగాలకు చెందినవి కావడం గమనార్హం. మొత్తం మొండి బకాయిల్లో లోహ రంగంలోని కంపెనీలు 30%, నిర్మాణ రంగంలోనివి 25%, విద్యుత్ రంగంలోనివి 15% ఉన్నాయి. మిగిలిన రంగాల నుంచి 30% ఉన్నాయి. దివాళా చట్టం సంస్కరణలను సమర్థంగా వినియోగించుకుంటేనే బ్యాంకులకు రుణ రాబడి పెరుగుతుంది. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల నుంచి రుణాలు రాబట్టుకోవడానికి 2018 బడ్జెట్లో బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇస్తారని నిపుణులు భావిస్తున్నారు. మూలధన విలువ తగ్గిపోవడంతో స్టేట్బ్యాంక్ గ్రూప్లోని 19 బ్యాంకుల్లో ఎస్బీఐ మినహా 10 బ్యాంకులు ఆర్బీఐ ప్రొగ్రెసీవ్ కరెక్టీవ్ యాక్షన్ను (పీసీఏ)ను ఎదుర్కొంటున్నాయి. నిర్దేశించిన మూలధన విలువ కన్నా తక్కువ ఉన్న బ్యాంకుకు ఆర్బీఐ విధించే అపరాధ రుసుమును పీసీఏ అంటారు.
ఉమ్మడి విధానం అనుసరించాలన్న గ్రామీణ విద్యుద్ధీకరణ సంస్థ
బ్యాంకుల మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వమే సహకరించాలని జాతీయ గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ రమేశ్ తెలిపారు. కేంద్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోగి పథకం కింద రూ.18 వేల కోట్లు కేటాయించింది. అయితే గ్రామాలకు విద్యుత్ సరఫరా కోసం తలెత్తుతున్న సమస్యలు, ఆటంకాలు ఉన్నాయన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ డిమాండ్ల లక్ష్యాల సాధనకు క్రుషి చేశామన్నారు. తాము 18,548 గ్రామాలకు విద్యుద్ధీకరణ పథకానికి చేరువలో ఉన్నామన్నారు. మిగతా లక్ష్యాలను త్వరలోనే చేరుకుంటామన్నారు. ఈ క్రమంలో మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలని పీవీ రమేశ్ కోరారు. బ్యాంకులతో ఉమ్మడిగా మొండి బకాయిలను వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
బ్రిక్స్ దేశాల్లో మొదటి స్థానంలో భారత్
ఇక ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులకు పారిశ్రామికవేత్తలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించక మొండి బకాయిలుగా మారిన దేశాల్లో 9.9 శాతంతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. బ్రిక్స్ సభ్య దేశాల్లో భారతదేశానిదే అగ్రస్థానం. ‘కేర్' సంస్థ గణాంకాల ప్రకారం గతేడాది జూన్ నాటికి భారతదేశ బ్యాంకులు రూ.7.33 లక్షల కోట్లకు చేరుకున్నది. ఈ క్రమంలో బ్యాంకులను ఆదుకునేందుకు కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల పెట్టుబడులు విడుదల చేసింది. వాటిలో రూ.1.35 లక్షల కోట్లు రీ క్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో సుమా. ఇక మొండి బకాయిల జాబితాలో పోర్చుగల్, ఇటలీ, ఐర్లాండ్, గ్రీస్, స్పెయిన్ అగ్ర స్థానాల్లో ఉన్నాయి. అయితే భారత్ ఐదో స్థానంలో ఉంటే స్పెయిన్ ఏడో స్థానానికి చేరుకున్నది. రష్యాలో మొండి బకాయిలు భారీగానే పేరుకుపోయాయి. స్పెయిన్ తో పోలిస్తే భారతదేశంలో మొండి బకాయిల నిష్పత్తి 400 పాయింట్లు ఎక్కువ.
వివిధ శాఖల అధికారులతో అంతర్గత కమిటీ ఏర్పాటు
సమీప భవిష్యత్లో ప్రపంచంలోకెల్లా దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుందని సమాచారం. ఇందుకోసం గత నవంబర్ ఒకటో తేదీన వివిధ మంత్రిత్వశాఖల అధికారులతో కమిటీని వేశారు. ఇందుకోసం ఆర్థిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఆల్టర్నేటివ్ మెకానిజం వ్యవస్థ ఏర్పాటైంది. ఈ దిశలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు గత నెలలో రూ.2.11 లక్షల కోట్ల పెట్టుబడిని మంజూరు చేసింది కేంద్రం. ఇటీవల బ్యాంకుల్లో పెట్టుబడుల పునర్వ్యస్థీకరణకు రూ.80 వేల కోట్ల విలువైన అదనపు బాండ్లు విడుదల చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది.
ఇంద్రదనుస్సు కింద రూ.70 వేల కోట్ల పెట్టుబడులు
అదనంగా ఆరు బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.5,777 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. భారీగా మొండి బకాయిలు గల ఈ ఆరు బ్యాంకులు ప్రస్తుతం ఆర్బీఐ నిఘా కింద ఉన్నాయి. అవే ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా', ‘ఐడీబీఐ బ్యాంక్', ‘సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా', ‘డెనా బ్యాంక్', ‘బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర', ‘యూకో బ్యాంక్' ఉన్నాయి. ఇంద్ర దనుస్సు పథకం కింద నాలుగేళ్ల పాటు రూ.70 వేల కోట్లు కేటాయించింది. 2015 - 16లో రూ.25 వేల కోట్లు, 2016 - 17లో రూ.10 వేల కోట్లు, 2017 - 18, 2018 - 19లలోనూ రూ.10 వేల కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించింది.