ఆభరణాలకు యమ గిరాకీ: 14 నెలల గరిష్ఠానికి గోల్డ్
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలంటే ప్రపంచంలోకెల్లా భారతీయ వనితలకు అత్యంత ప్రీతిపాత్రం. ఏ మాత్రం అవకాశం చిక్కినా పసిడి కొనుగోళ్లకే బామలు ప్రాధాన్యం ఇస్తారు. తాజాగా అమెరికాలో కార్మికులు, ఉద్యోగుల వేతనాల డేటా విడుదలైందని అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు, భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) బుధవారం ద్రవ్యపరపతి సమీక్ష చేయనున్నదన్న సంకేతాల మధ్య మంగళవారం 'మంగళ'ప్రదంగా స్టాక్ మార్కెట్లన్నీ గడగడా వణికిపోయాయి. అయితేనేం బంగారం పట్ల మదుపర్ల విశ్వాసం, నమ్మకం ఏమాత్రం సడలలేదు. సరికదా స్టాక్ మార్కెట్ల పతనంతో డిమాండ్ బాగా పెరిగింది. పసిడి ధర 14 నెలల గరిష్ఠానికి చేరుకుంది. బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.31,600కు చేరింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ బాగా పెరిగడంతో బంగారం ధర పెరిగిందని బులియన్ వర్గాలు వెల్లడించాయి. స్టాక్ మార్కెట్లలో భారీ పతనాలతో మదుపర్లు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారని బులియన్ ట్రేడర్లు చెప్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర ఒక్క రోజే రూ.300 పెరిగి రూ.31,570కు చేరింది. దేశ రాజధాని హస్తినలోనూ ఒక్క రోజే రూ.330 పెరిగి రూ.31,600కు చేరింది. ఒక బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగింది. వ్యాపార వర్గాల నుంచి డిమాండ్ బాగా పెరగడంతో కేజీ వెండి ధర రూ.500 పెరిగి రూ.40వేలకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.27శాతం పెరిగి 1,342.60 డాలర్లు కాగా, వెండి ధర 0.84శాతం పెరిగి ఔన్సు వెండి ధర 16.85డాలర్లుగా స్థిరపడింది.

స్టాక్ మార్కెట్లలో బలహీనతతో మున్ముందుకే
ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి, వెండి ధర మరింత ముందుకు పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డాలర్తో రూపాయి మారకం రేటు బక్క చిక్కటం, స్టాక్ మార్కెట్లలో కనిపిస్తున్న బలహీనత ఇందుకు దోహదపడుతుందని జెన్ కమొడిటీస్ విశ్లేషకుడు ఓం నమశివాయ తెలిపారు. భారత మార్కెట్లో పది గ్రాముల మేలిమి బంగారం ఇప్పటికే రూ.31,600కు చేరింది. ‘మరో మూడు నెలల్లో పది గ్రాముల పసిడి రూ.32,000కు, కిలో వెండి రూ.41,000 - 42,000 కు చేరే అవకాశం ఉంది' అని కమొడిటీస్ నిపుణులు భరత్ చెప్పారు. ఈ రెండు విలువైన లోహాల ప్రస్తుత ధరలను రెసిస్టెన్స్ ధరగా భావించవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అంతర్జాతీయంగా ఏడు శాతం డిమాండ్ క్షీణత
భారతీయులకు బంగారం పట్ల ఉన్న మక్కువ అంతకంతకూ పెరిగిపోతోంది. 2017లో దేశీయంగా వినియోగం తొమ్మిది శాతం పెరిగి 727 టన్నులుగా నమోదైంది. కానీ, అంతర్జాతీయంగా మాత్రం డిమాండ్ ఏడు శాతానికి పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తెలిపింది. 2016లో దేశీయ బంగారం డిమాండ్ 666.1 టన్నులే. ‘2017లో డిమాండ్ ప్రధానంగా ఆభరణాల వల్లే పెరిగింది. నూతన పన్ను చట్టం జీఎస్టీ స్థిరపడటం, స్టాక్ మార్కెట్ల ర్యాలీ, జీడీపీ వృద్ధి ఇవన్నీ కలసి వినియోగదారుల సెంటిమెంట్ను మెరుగు పరిచాయి'అని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ భారత్ ఎండీ పీఆర్ సోమసుందరం తెలిపారు. ఆభరణాల కొనుగోళ్లపై యాంటీమనీ లాండరింగ్ చట్టాన్ని తొలగించడం కూడా డిమాండ్ పెరగడానికి దోహదపడినట్టు పేర్కొన్నారు. 2016లో ఆభరణాల డిమాండ్ 504.5 టన్నులుగా ఉండగా, 2017లో ఇది 12 శాతం పెరిగి 562.7 టన్నులకు చేరింది. విలువ పరంగా చూస్తే గతేడాది ఆభరణాల డిమాండ్ 9 శాతం వృద్ధితో రూ.1,48,100 కోట్లకు చేరింది. పెట్టుబడుల డిమాండ్ మాత్రం 2016లో 161.6 టన్నులు కాగా, 2017లో ఇది 164.2 టన్నులుగా నమోదైంది. గత పదేళ్లలో సగటున భారతదేశంలో బంగారానికి 840 టన్నులకు పైగా డిమాండ్ వచ్చిందన్నారు.

2016తో పోలిస్తే 2017లో తగ్గిన ఈటీఎఫ్ పెట్టుబడులు
రానున్న రెండేళ్లలో కాయిన్ల వృద్ధి అధికంగా ఉంటుందని డబ్ల్యూజీసీ భారత్ ఎండీ సోమసుందరం పేర్కొన్నారు. 2018లో డిమాండ్ విషయంలో తాము ఆశాభావంతో ఉన్నామని, 700-800 టన్నుల మధ్య ఉండవచ్చునన్నారు. ఇక దిగుమతుల పరంగా చూస్తే 2017లో 888 టన్నుల బంగారం దిగుమతి అయింది. 2016లో ఉన్న 558 టన్నుల కంటే ఇది 59 శాతం అధికం. అంతర్జాతీయంగా చూస్తే 2017లో బంగారం వినియోగం గతేడాది 7 శాతం క్షీణతతో 4,071.7 టన్నులకు పరిమితమైంది. ఈటీఎఫ్ల్లోకి తక్కువ పెట్టుబడులు రావడమే కారణంగా డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. 2016లో డిమాండ్ 4,362 టన్నులుగా ఉండటం గమనార్హం. పూర్తి సంవత్సరాన్ని గమనిస్తే ఏడాది అంతటా ఈటీఎఫ్లలోకి పెట్టుబడులు వచ్చినప్పటికీ 2016లో వచ్చిన నిధులతో పోలిస్తే మూడింట ఒక వంతే ఉన్నాయని డబ్ల్యూజీసీ తెలిపింది. బంగారం కాయిన్లు, బార్ల డిమాండ్ సైతం 2% తగ్గింది.












Click it and Unblock the Notifications