కుప్పకూలిన రూపాయి! దండెత్తిన డాలర్, సరికొత్త కనిష్టానికి కరెన్సీ
గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు మంటలు, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణతో భారత రూపాయి క్రమంగా బలహీనపడుతోంది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 27 పైసలు క్షీణించి 95.79 రికార్డు స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బారెల్కు 108 డాలర్లకు పైగా స్థిరంగా కొనసాగుతుండటం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు నిధులను విపరీతంగా వెనక్కి తీసుకుంటుండటమే దీనికి ప్రధాన కారణం. గురువారం ట్రేడింగ్లోనూ 44 పైసలు నష్టపోయి 95.52 వద్ద ముగిసిన రూపాయి.. వరసగా రెండో రోజు కూడా అదే నష్టాల బాట పట్టడం దేశీయ ఆర్థిక వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ కొండంత అభయం ఉన్నా కానీ..
ప్రస్తుతం రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన స్థిరత్వంతోనే ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రికార్డు స్థాయిలో నిల్వ ఉన్న విదేశీ ఫారెక్స్ రిజర్వులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో వేగంగా తీసుకుంటున్న చర్యలు , దేశీయంగా నమోదవుతున్న 7.8 శాతం బలమైన ఆర్థిక వృద్ధి రూపాయికి కొండంత అభయాన్ని ఇస్తున్నాయి. అయితే, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు , విదేశీ బాండ్ ఈల్డ్స్ కారణంగా మన దిగుమతుల బిల్లు భారం భారీగా పెరుగుతుండటంతో రూపాయి కోలుకోలేకపోతోంది.

మరింత తగ్గనున్న రూపాయి విలువ?
ముడిచమురు ధరలు బారెల్కు 100 డాలర్ల పైనే కొనసాగితే, రాబోయే రోజుల్లో రూపాయి మరింత ఒత్తిడికి గురై డాలర్తో పోలిస్తే 96 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ డాలర్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగి 99.16 వద్ద కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు , స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా ఆయిల్ రవాణా నిలిచిపోతుందనే భయాలు క్రూడ్ ఆయిల్ ధరలు 108.45 డాలర్ల వద్దే ఉండటానికి కారణమవుతున్నాయి. రాబోయే రోజుల్లో వెలువడనున్న భారత్, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపైనే ఇప్పుడు మార్కెట్ దృష్టి నెలకొంది.
ఈక్విటీ మార్కెట్లను ముంచెత్తిన నష్టాలు
రూపాయి క్షీణత , ముడిచమురు సెగ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఉదయం ట్రేడింగ్లోనే బిఎస్ఇ సెన్సెక్స్ 628.24 పాయింట్లు పతనమై 74,257.69 వద్దకు చేరగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ 221.20 పాయింట్లు నష్టపోయి 23,255.10 వద్దకు పడిపోయింది. మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిరంతరం అమ్మకాలకే మొగ్గు చూపుతుండటంతో నష్ట తీవ్రత పెరిగింది. ఒక్క గురువారం నాడే విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.438.24 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు ఎక్స్చేంజ్ డేటా వెల్లడించింది.














Click it and Unblock the Notifications
