2018లో బడ్జెట్: మౌలిక రంగం, ఉపాధి కల్పనకే పెద్దపీట
న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఏడాది చివరిలో మరో నాలుగు అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్సభ ఎన్నికల్లో గెలుపొందాలంటే కీలకమైన మౌలిక వసతులు, ఉపాధి కల్పన రంగాలపై ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ భావిస్తున్నది. వచ్చేనెల ఒకటో తేదీన పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించనున్నారు.
దీంతోపాటు రోడ్లు, నౌకాశ్రయాలు, విద్యుత్, ఐటీ, టెలికం రంగాలపై కేంద్ర అరుణ్ జైట్లీ ద్రుష్టి సారించారని సమాచారం. వీటితోపాటు రైల్వే శాఖతోపాటు సామాజిక రంగాలైన ఆరోగ్యం, విద్య, మహిళా శిశు అభివ్రుద్ధి శాఖల మాదిరిగా ఇతర రంగాలు, శాఖలు నిధుల కేటాయింపునకు నోచుకోవని ఆర్థిక శాఖ వర్గాల కథనం.

జాతీయ రహదారులకు భారీగా నిధుల కేటాయింపు చాన్స్
గత మూడున్నరేళ్లలో వివిధ శాఖల మంత్రులు తమకు కేటాయించిన నిధులను ఏ పద్దతిలో వినియోగించారన్న అంశాన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని విత్త మంత్రి అరుణ్ జైట్లీ ఈ దఫా నిధుల కేటాయింపు జరిపే అవకాశం ఉన్నదని అధికార వర్గాల కథనం. ఆ క్రమంలో బేష్షుగ్గా పని చేసి కొంత మేరకు సత్ఫలితాలు సాదించిన రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు భారీగా నిధుల కేటాయింపు పెరిగే అవకాశం ఉన్నదని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు చెప్పాయి.

సంస్థాగత, నిర్వహణ సంస్కరణలు అమలు చేస్తేనే పురోగతి
తర్వాతీ క్రమంలో విద్యుత్ రంగానికి మెరుగైన కేటాయింపులు ఉంటాయని చెప్తున్నారు. ఇక ప్రపంచానికే చుక్కానిగా మారుతున్న ఐటి, టెలికం రంగాలకు ప్రాదాన్య క్రమంలో నిధుల కేటాయింపులు జరుగుతున్నాయని ఆ ఆర్థికశాఖ అధికారి ఒకరు తెలిపారు. రైల్వేశాఖకు గణనీయ సంఖ్యలో బడ్జెట్ కేటాయింపులు ఉండబోవని ఆర్థికశాఖ అధికారి తెలిపారు. కొన్ని మంత్రిత్వశాఖలు సంస్థాగత, నిర్వహణా సంస్కరణలు అమలు చేయాల్సి ఉన్నది.

పలు శాఖలకు కొన్ని రాయితీలు లభించే చాన్స్
రైల్వేశాఖలో అంతర్గత సంస్కరణలు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్ష్య సాధనకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తున్నది. అందువల్లే రైల్వేశాఖకు భారీగా నిధుల కేటాయింపు ఉండకపోవచ్చునని ఆర్థికశాఖ అధికారి అంటున్నారు. చౌక ధరకే గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఇండ్ల పథకాలు, స్వచ్ఛ్ భారత్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు తదితర పథకాలు అమలులోకి కొన్ని రాయితీలు పొందే అవకాశాలు ఉన్నాయని ఆర్థికశాఖ మరో అధికారి తెలిపారు.

సామాజిక వర్గాల కోసం ఆరోగ్య, పెన్షన్ పథకాలు ప్రకటించే అవకాశం
కొన్నిసామాజిక రంగాల వారిని ప్రభుత్వం నిరాశ పరిచే అవకాశం ఉన్నదని ఆర్థికశాఖ అధికారులు చెప్తున్నారు. కాకపోతే కొన్నిఆరోగ్య పథకాలు, పెన్షన్ పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆరోగ్యం, మహిళా శిశు అభివ్రుద్ధి, విద్యా రంగానికి అవసరమైన నిధుల కేటాయింపుల్లో స్వల్పంగా తగ్గుదల ఉండొచ్చని ఆర్థికశాఖ వర్గాల కథనం. నిధులను వినియోగించుకోవడంలో ఆయా శాఖల మంత్రులు పూర్తిగా విఫలమయ్యారన్న వార్తలు వినిపించాయి. పలు ప్రాజెక్టుకు 30 శాతం లోపు నిధులు కూడా ఖర్చు చేయని శాఖలకు నిధుల కేటాయింపు తగ్గిస్తారని సంకేతాలు కనిపిస్తున్నాయి.

నమామీ గంగే ప్రాజెక్టు పరిస్థితి ఇది
ఉదాహరణకు నిర్భయ పథకం కింద మొత్తం కార్ఫస్ ఫండ్ రూపేణా రూ.3100 కోట్లు కేటాయిస్తే, ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు. అలాగే గంగానది పరిశుభ్రత కోసం ‘నమామీ గంగే' ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. అంతకుముందు ప్రస్తుత ఏడాది కేటాయించిన రక్షణ శాఖ నిధులు ఖర్చు చేయకుంటే తదుపరి ఏడాదికి కొనసాగించాలని చేసిన అభ్యర్థన తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications