ఐదు స్టాక్లు మినహా అన్నీ పతనమే.. బడ్జెట్ డేన స్టాక్ మార్కెట్ల పయనమెటు?
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్కు మరో మూడు రోజుల టైం తీసుకున్నది. దీంతో అందరిలో టెన్షన్ తీవ్రస్థాయికి చేరుకున్నది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడి దారుల్లో ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంది. వరుసగా ఏడేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన నాడే భారీగా తగ్గిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినప్పుడు మాత్రం 486 పాయింట్లు లాభపడ్డాయి. వరుసగా 2005, 2006లో సానుకూలంగా స్పందించిన సూచీలు అప్పటి ఆర్థిక మంత్రి పీ చిదంబరం బడ్జెట్ ప్రవేశపెట్టిన 2007లో ఏకంగా ఏడు శాతం పడిపోయింది. అప్పటి నుంచి దిగువముఖం పట్టిన సూచీలు 2010లో మాత్రం స్వలంగా లాభపడ్డాయి. ఆ తర్వాత ఎన్డీఏ నేతృత్వం లోని నూతన సర్కార్ కొలువుదీరిన నాడు బడ్జెట్ రోజు సూచీల పతనాన్ని ఏ మాత్రం ఆపలేకపోయింది.
స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నా.. ఆ షేర్లకు లబ్ది
2007 వరకు బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు గరిష్ఠంగా తొమ్మిదో శాతం వరకు పతనం చెందిన సూచీలు..ఆ తర్వాత పదేళ్లలో స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకున్నాయని సర్వేలు చెబుతున్నాయి. బడ్జెట్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు.. సున్నిత రంగాలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఇదే క్రమంలో గతేడాదిలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించడంతో ఈ రంగ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. 2016 ఫిబ్రవరి 11న సెన్సెక్స్ 22,951 పాయింట్ల వద్ద ముగియగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 వేల పాయింట్లు లేదా 56% లాభపడింది. నిఫ్టీ విషయానికొస్తే 400 పాయింట్లు (57%) చొప్పున లాభపడ్డాయి. కాగా, స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నా బడ్జెట్ సమయంలో ఐదు స్టాకులు మాత్రం పెరిగాయి.
లాభాల బాటలో పయనిస్తున్న ఆర్థిక సేవల సంస్థల షేర్లు
ప్రముఖ నాన్-బ్యాంకింగ్ సేవల సంస్థ బజాజ్ ఫైనాన్స్ 2015లో 6.08 శాతం లాభపడగా, 2016లో 2.15 శాతం, 2017లోనూ 2.95 శాతం పెరిగింది. భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ తెలంగాణ రాష్ర్టానికి చెందిన ప్రముఖ సూక్ష్మ రుణాల సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ (గతంలో ఎస్కేఎస్) 2015లో 5.07 శాతం 2016లో 2.61 శాతం, గతేడాది అత్యధికంగా 8.93 శాతం పెరిగింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కూడా గడిచిన మూడేండ్లుగా భారీగా లాభపడింది. 2015లో 4.46 శాతం, 2016లో 2.81 శాతం, 2017లో 3.09 శాతం పెరిగింది. దేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ సైతం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు భారీగా పుంజుకుంటున్నది. మూడేండ్ల క్రితం 3.15 శాతం లాభపడిన బ్యాంక్ షేరు.. 2016లో 2.79 శాతం, 2017లో 4.4 శాతం ఎగిసింది. ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కూడా లాభపడిన సంస్థల్లో ఉన్నది. 2015లో 2.66 శాతం లాభపడిన కంపెనీ షేరు, ఆ తర్వాత ఏడాదికి 4.1 శాతం, గతేడాదిలో 3.04 శాతం పెరిగాయి.
ట్రేడింగ్ పై బ్యాంకర్ ఉదయ్ కొటక్ హెచ్చరికలు
మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్లతో జాగ్రత్తని ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కొటక్ మదుపరులను హెచ్చరించారు. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలకు హాజరైన ఆయన పిటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పైవిధంగా స్పందించారు. దేశీయ ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న వృద్ధిదాయక మార్పులతో స్టాక్ మార్కెట్లు రికార్డుస్థాయి లాభాల్లో కదలాడుతున్నాయన్న ఆయన నష్టాలు వస్తే మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్లు తీవ్రంగా ప్రభావితం కావచ్చన్నారు. ఇది చిన్న మదుపరులకు ప్రమాదమన్నారు. కాబట్టి ఈ బూమ్కు దూరంగా ఉన్న ప్రధాన సంస్థల్లో పెట్టుబడులే శ్రేయస్కరమన్నారు.
గత నెలలో విదేశీ పెట్టుబడుల విలువ రూ.18 వేల కోట్లు
గత నెలలో పార్టిసిపేటరీ నోట్ల (పీ-నోట్లు) ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడులు ఆరు నెలల గరిష్ఠంగా నమోదయ్యాయి. డిసెంబర్లో ఈక్విటీ, డెట్, డెరివేటివ్లలో రూ.1,52,243 కోట్ల పెట్టుబడులను పెట్టారు. జూన్లో రూ.1.65 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లో పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెల నవంబర్లో రూ.1,28,639 కోట్లుగా ఉన్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలియజేసింది. కాగా, ఈ నెలలో ఇప్పటిదాకా దేశీయ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్పీఐ) తెచ్చిన పెట్టుబడుల విలువ దాదాపు రూ.18,000 కోట్లు (సుమారు 3 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. జనవరి 1 నుంచి 25 మధ్య స్టాక్ మార్కెట్లలోకి రూ.11,759 కోట్లు రాగా, రుణ మార్కెట్లలోకి రూ.6,127 కోట్లు వచ్చాయి. గతేడాది మొత్తంగా అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి వచ్చిన ఎఫ్పీఐ పెట్టుబడుల విలువ రూ.2 లక్షల కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే.