సన్ఫ్లవర్ ఆయిల్ రేటు ఇప్పుడు ఎంతో తెలుసా? అమ్మకాలకు బ్రేక్..
యుద్ధం ఎక్కడో జరుగుతున్నా.. దాని ప్రభావం మాత్రం మన వంటింటిపై స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో శుద్ధి చేసిన సన్ఫ్లవర్ ఆయిల్ అమ్మకాలు 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ (CRISIL) తన తాజా నివేదికలో వెల్లడించింది.
భారతదేశం తన సన్ఫ్లవర్ ఆయిల్ అవసరాల కోసం ప్రధానంగా ఉక్రెయిన్, రష్యా దేశాలపై ఆధారపడుతుంది. అయితే, పశ్చిమాసియాలో జరుగుతున్న సంఘర్షణల వల్ల నౌకల ప్రయాణ మార్గాలు మారిపోయాయి. 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' వంటి సుదీర్ఘ మార్గాల గుండా ప్రయాణించాల్సి రావడంతో రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏడాది క్రితం టన్నుకు 1,275 డాలర్లు ఉన్న ముడి సన్ఫ్లవర్ ఆయిల్ ధర, ఇప్పుడు 1,440 డాలర్లకు చేరింది. దీనికి తోడు రూపాయి విలువ తగ్గడం కూడా దిగుమతి వ్యయాన్ని భారంగా మార్చింది.

ప్రత్యామ్నాయాల వైపు వినియోగదారులు..
ధరల పెరుగుదల ప్రభావం నేరుగా రిటైల్ మార్కెట్పై పడింది. జనవరి 2026లో లీటరుకు రూ. 150గా ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ధర, ఇప్పుడు రూ. 170 నుంచి రూ. 175కి చేరింది. దీంతో సామాన్య వినియోగదారులు దీనికంటే రూ. 10 నుంచి రూ. 20 తక్కువ ధరకే లభించే రైస్ బ్రాన్, సోయాబీన్ నూనెల వైపు మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా వినియోగించే 26 మిలియన్ టన్నుల వంటనూనెలలో సన్ఫ్లవర్ వాటా 12-14% కాగా, తాజా పరిస్థితులతో ఈ వాటా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
రిఫైనర్ల వద్ద తగ్గుతున్న నిల్వలు..
ధరల అనిశ్చితి, సరఫరా అడ్డంకుల వల్ల దేశీయ శుద్ధి కర్మాగారాల (Refineries) వద్ద ఇన్వెంటరీ నిల్వలు తగ్గిపోయాయి. సాధారణంగా 45 రోజులకు సరిపడా నిల్వలు ఉంచుకునే రిఫైనర్లు, ఇప్పుడు కేవలం 20-30 రోజులకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే, గతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన నిల్వలు ఉండటం వల్ల కంపెనీల లాభదాయకతకు ప్రస్తుతానికి ఢోకా లేదని క్రిసిల్ పేర్కొంది. కానీ, ఈ ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే మాత్రం సరఫరా వ్యవస్థ మరింత సంక్లిష్టంగా మారి, ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.












Click it and Unblock the Notifications