రూపాయి ఛార్జ్ పడదు! మా కస్టమర్లకు ఫ్రీగానే... ఫోన్పే సంచలన గ్యారెంటీ
యూపీఐ చెల్లింపులపై సేవారూపంలో అదనపు ఛార్జీలు పడతాయేమోనని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. డిజిటల్ లావాదేవీలు జరిపే సామాన్య వినియోగదారులకు రూపాయి కూడా ఖర్చు పెరగదని, టీ నుంచి వేల రూపాయల కొనుగోళ్ల వరకు యూపీఐ సేవలు ఎప్పటిలాగే పూర్తి ఉచితంగానే అందుబాటులో ఉంటాయని ఫోన్పే సీఈఓ సమీర్ నిగమ్ తేల్చిచెప్పారు.
లోక్సభలో కొత్త పన్నుల సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సర్వీస్ ఛార్జీలపై వ్యాపించిన గందరగోళాన్ని పటాపంచలు చేస్తూ, సామాన్యులకు ఎలాంటి భయం అక్కర్లేదని ఆయన స్పష్టమైన గ్యారెంటీ ఇచ్చారు.

రూ. 2,000 దాటితేనే లెక్కలు... అవీ వ్యాపారులకే!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధనల ప్రకారం.. రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలపై మాత్రమే 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR) విధించే ప్రతిపాదన ఉంది. ఇది 0.25 శాతం నుంచి 0.4 శాతం వరకు ఉండే అవకాశం ఉందే తప్ప, సాధారణ పౌరులు ఒకరికొకరు పంపుకునే డిజిటల్ లావాదేవీలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రతిపాదిత రుసుము పూర్తిగా వ్యాపారులు మరియు పేమెంట్ యాప్స్ నిర్వాహక సంస్థల మధ్య జరిగే వ్యాపార ఒప్పందాలకు మాత్రమే పరిమితం. కాబట్టి వినియోగదారులు కట్టే బిల్లులపై దీని ప్రభావం నేరుగా పడదని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) సైతం అధికారికంగా ప్రకటించింది.
చిన్న వ్యాపారులకు, వీధి వ్యాపారులకు వెసులుబాటు
ఈ కొత్త నిబంధనల వల్ల గల్లీల్లో ఉండే చిన్న కిరాణా కొట్టు నిర్వాహకులు, చిన్నతరహా వ్యాపారులు ఇబ్బంది పడతారేమోనన్న అనుమానాలకు కూడా పరిశ్రమల మండలి చెక్ పెట్టింది. చిన్న వ్యాపారుల నుంచి కూడా ఎలాంటి ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేయబోరని స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపుల విప్లవం దేశవ్యాప్తంగా మూలమూలకూ విస్తరించడానికి చిన్న వ్యాపారులే ప్రధాన కారణమని, అందుకే వారికి ఉచిత పరిమితిని వర్తింపజేస్తూ వారి ప్రయోజనాలను కాపాడటమే ప్రాథమిక లక్ష్యమని సంస్థ పేర్కొంది.




Click it and Unblock the Notifications