ప్రమాద ఘంటికలు: బడ్జెట్లో రైతులకు ఉపశమన చర్యలుంటాయా?
న్యూఢిల్లీ: గత మూడు దశాబ్దాల్లో తొలిసారి 2014 లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికార దండం చే'పట్టిన' ప్రధాని నరేంద్రమోదీకి కాలం గడిచే కొద్దీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మద్దతు కొడిగట్టిపోతున్నదని పరిణామాలు చెబుతున్నాయి. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, గ్రామీణుల జీవన ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని ఆయన ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు మరి. ఉత్తర భారతంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక, రుణదాతల వేధింపులు తాళలేక పంట పొలాలను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకు దేశ రాజధాని 'హస్తిన'కు శివారులోని ధమాకా గ్రామంలో 230 కుటుంబాలు నివసిస్తున్నాయి. వాటిలో 60 మందికి పైగా భూములను వేలం వేస్తామని నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో స్థానికులు తమకు రుణ మాఫీ కల్పించాలని, తమ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ అంశాలను చేర్చాలని కోరుతున్నారు. 'ఈ సంక్షోభం నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలియదు' అని సింగ్ (62) అనే రైతు తెలిపారు. తక్షణం రూ.2.47,296 రుణ బకాయి చెల్లించాలని ఈ నెల ప్రారంభంలోనే ఆయనకు నోటీసు అందింది. గత ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఓటేశారు. కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఎన్నికల్లో మళ్లీ ఆయనకే ఓటేస్తానన్న గ్యారంటీ ఇవ్వలేనని చెప్పారు. ఇలా గ్రామీణుల నుంచి 2014లో భారీగా ప్రజల మద్దతుతో విజయం సాధించిన ప్రధాని మోదీ మళ్లీ రైతుల మద్దతు కూడగట్టేందుకు గణనీయ ద్రవ్య పరపతి చర్యలు ప్రకటించడానికి ఈ బడ్జెట్ మాత్రమే చివరి అవకాశం అని సింగ్ వంటి రతులు అంటున్నారు.
మోదీపై పెరుగుతున్న గ్రామీణుల అసంత్రుప్తి
‘ప్రభుత్వాలు పూర్తిగా పట్టణ ఓటర్లు, సమస్యలపైనే ద్రుష్టి సారిస్తాయి. వీటివల్ల అరుదుగా విజయం సాధిస్తాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలే తదుపరి భారతదేశ రాజకీయ పరిస్థితులను నిర్దేశిస్తాయి‘ అని వాషింగ్టన్ కేంద్రంగా నడుస్తున్న భారత్ అమెరికా విధానాల అధ్యయన కేంద్రం వాడ్వానీ చైర్ రిచర్డ్ రోస్సో చెప్పారు. మళ్లీ ప్రధాని మోదీ గ్రామీణ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు కొన్ని రాజకీయ సవాళ్లు ఇమిడి ఉన్నాయని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీపై గ్రామీణుల్లో అసంత్రుప్తి క్రమంగా పెరుగుతున్నది. గ్రామీణుల జీవన స్థితిగతుల మెరుగుదలకు క్రుషి చేస్తానని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి మరీ 68 శాతం మంది ప్రజల మద్దతు కూడగట్టుకున్న ప్రధాని మోదీ.. రైతుల సమస్యలపై ద్రుష్టి సారించాలన్న సూచనలు వ్యక్తం అవుతున్నాయి. దేశీయ సమస్యలపై ద్రుష్టి పెట్టాలన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామన్న అరుణ్ జైట్లీ
ప్రధాని నరేంద్రమోదీ స్వంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ సీట్లను గెలుచుకోవడంలో అధికార బీజేపీ విఫలమైంది. తాజాగా ఈ ఏడాది మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ పట్ల రైతుల ఆగ్రహాన్ని, వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించాయి. ప్రభుత్వ నియంత్రణ విధానాలకు చెంపపెట్టు అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ రాఘవేంద్ర ఝా స్పందిస్తూ ‘గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆయన ఇక ఎంతమాత్రం పట్టణ ఓటర్లపై ఆధారపడలేరు‘ అని చెప్పారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో పంటల బీమా, శీతల గిడ్డంగుల ఏర్పాటు, పంటల మార్కెటింగ్కు వసతులు కల్పిస్తూ కేంద్రం కొన్ని చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ తమ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. దేశ ఆర్థిక ప్రగతి న్యాయబద్ధంగా, సమతుల్యత సాధించలేదన్నారు.
జీడీపీ తగ్గుముఖం ఆపై ద్రవ్యలోటు.. ద్రవ్యోల్బణం సవాళ్లు
గ్రామీణులతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణ భారతీయుల నుంచి ప్రధాని మోదీకి ఒత్తిళ్లు ఎదురు కానున్నాయి. ప్రత్యేకించి పన్ను చెల్లింపుల విధానాన్ని విస్తరించడంతో సగటు భారతీయుల్లో సహజంగానే ఆగ్రహం పెల్లుబుకుతోంది. అదే సమయంలో పలు రాయితీలు కల్పించినా సర్కార్ తీరు పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి 6.5 శాతంగా నమోదవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్భణం ముప్పు మోదీ సర్కార్ ను వెంటాడుతూనే ఉన్నది. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లో ద్రవ్యలోటును మూడు శాతానికి పరిమితం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం పూర్తిగా ఉద్దేశపూర్వంగా వ్యాపార వేత్తలు, వాణిజ్యవేత్తలకు మేలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నదన్న అభిప్రాయాలు బలంగావ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోదీ గ్రామీణులు, నిరుద్యోగ యువత కోసం పలు కార్యక్రమాలు, పథకాలు ప్రారంభించారు. కానీ వ్యవసాయ రంగంలో వ్రుద్ధిరేటు ఒక్కశాతం లోపే ఉండటం ఆందోళనకరంగా ఉంది. 2014, 2015లల్లో వరుసగా వర్షాభావ పరిస్థితులకు తోడు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇలా చర్యలు ప్రతిపాదించిన ప్రధాని మోదీ
2015 - 16 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత శాతం క్రమంగా పెరుగుతోంది. పంట రుణాలు అంతకంతకు పెరిగాయి. దీంతో 2015లో రైతుల ఆత్మహత్యలు 42 శాతం పెరిగాయి. వినియోగ అవసరాలకు అనుగుణంగా గ్రామీణ కార్మికుల వేతనాలు పెరగలేదు. 2016 - 17లో సాధారణ వర్షపాతంతో బంపర్ పంటల సాగు జరిగినా.. పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణులకు ఇళ్లు, తాగునీరు, గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపడతామని హామీలు గుప్పించారు. పలు పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించారు. పంటల బీమాను ప్రోత్సహించారు. సమగ్ర వ్యవసాయ మార్రెట్లు ఏర్పాటు చేశారు. రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. కానీ ధమాకా మాదిరిగా పలు గ్రామాలు పలు సమస్యలతో సతమతం అవుతున్నాయి. తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నీరు అంతా విషపూరితంగా మారింది. గత నాలుగేళ్లలో వ్యవసాయం బయట ధమాకా గ్రామానికి చెందిన 300 మంది యువకుల్లో కేవలం ఆరుగురికి మాత్రమే ఉద్యోగాలు లభించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థమవుతున్నది.