ఇంటి దొంగల కుచ్చుటోపీ రూ.2,450 కోట్లు: స్టాఫ్మోసాల్లో ఏపీ సెకండ్.. మనీలో రాజస్థాన్ హై
బెంగళూరు: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణం వెలుగు చూసిన తర్వాత పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న కుంభకోణాల్లో సొంత సిబ్బంది ప్రమేయం నానాటికీ పెరుగుతున్నది. పీఎన్బీ స్కాం మాదిరిగానే బ్యాంకుల్లో మోసాలు భారీగానే జరుగుతున్నాయని తేలింది.
ఈ మోసాల్లో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయమే ఎక్కువగానే ఉంటుందని తెలిసింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటాలో ఈ సంగతి తెల్లతేటమైంది. 2013 ఏప్రిల్ నుంచి 2016 జూన్ వరకు ఉన్న డేటాలో బ్యాంకుల్లో రూ.2,450 కోట్ల మేర అక్రమాలు జరిగాయని, ఇవి ఎక్కువగా ఉద్యోగుల సహకారంతోనే జరిగినట్టు తెలిసింది.
దక్షిణాది రాష్ట్రాల్లో 49 శాతం మోసాల కేసుల్లో రూ.462 కోట్లు హంఫట్
మొత్తం 1232 మోసాల కేసులు నమోదైనట్లు సమాచారం. వీటిల్లో రూ. లక్ష కంటే ఎక్కువ మోసాలు జరిగినవే అధికం. ఉద్యోగుల సహకారంతో జరుగుతున్న మోసాలు కోట్ల రూపాయల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 49 శాతం కేసులు నమోదు అయ్యాయని, కానీ మొత్తం రూ.462 కోట్ల నగదునే కోల్పోయినట్టు ఆర్బీఐ డేటా పేర్కొంది.
దక్షిణాదిలోనే ఎక్కువ మోసాలు నమోదని ఆర్బీఐ డేటా
మొత్తం కేసుల్లో చాలా తక్కువగా మూడు శాతం మాత్రమే నమోదైన రాజస్థాన్లో, భారీగా రూ.1,096 కోట్ల నగదును బ్యాంకులు పోగొట్టుకున్నట్టు తెలిపింది. బ్యాంకు ఉద్యోగుల ప్రమేయముండే ఇలాంటి మోసపూరిత కేసులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆర్బీఐ డేటా చెబుతున్నది.
రూ.1704 కోట్ల మేరకు ఆ రాష్ట్రాల్లో బ్యాంకులకు ఇలా కుచ్చుటోపీ
రాజస్థాన్, ఛండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బాగానే నగదు లూఠీ అవుతుందని తెలిసింది. రాజస్థాన్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన మోసాల వాటా మొత్తం దేశీయంగా బ్యాంకుల్లో మోసాలతో పోలిస్తే 70 శాతం ఉన్నదని ఆర్బీఐ డేటా పేర్కొంది. చండీగఢ్తో కలిపి ఈ మూడు రాష్ట్రాల పరిధిలో రూ.1704 కోట్ల మేరకు బ్యాంకులు నష్టపోయాయి. లక్ష, ఆపై మొత్తాల మోసాల కేసుల్లో బయట వ్యక్తులు, బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సాయంతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆర్బీఐ డేటా పేర్కొంది.
పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ బ్యాంకుల శాఖలు
దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఇలాంటి కేసులు నమోదవడానికి కారణం, ఆ రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు అధికంగా ఉన్నాయని ఓ బ్యాంకు మేనేజర్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా బ్యాంకు శాఖలున్నట్టు పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు ప్రమేయం ఉండే ఈ మోసాలను అసలు ఉపేక్షించేది లేదని కూడా ఆర్బీఐ తేల్చి చెప్పింది. బ్యాంకుల్లో మోసాలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో 170 కేసులతో తమిళనాడు తొలి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ 157 కేసులతో రెండో స్థానంలో ఉంది.
మహారాష్ట్రలో అధికంగా 609 కేసులు.. రూ.110 కోట్ల నష్టం
ఆంధ్రప్రదేశ్లో బ్యాంకు సిబ్బంది మోసాల వల్ల రూ.148.41 కోట్లు ఆయా బ్యాంకులకు నష్టం వాటిల్లింది.21 రాస్ట్రాల పరిధిలో 38 శాతం (467 కేసులు) నమోదైనా నష్టపోయిన సొమ్ము రూ.241.53 కోట్లు. మొత్తం నష్టంలో ఇది 10 శాతం. ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, ఛండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 609 మోసాల కేసులు (49%) నమోదైతే మొత్తం నగదు నష్టంలో ఆ రాష్ట్ర వాటా కేవలం 19 శాతమేనని ఆర్బీఐ పేర్కొంది.
మోసాలు, నిర్లక్ష్యం తదితర అంశాలపై ఆర్బీఐ మార్గదర్శకాలివి
సిబ్బందిని ఒకేశాఖలో ఎక్కువ కాలం కొనసాగించడం కూడా ఇటువంటి అనైతిక పద్ధతులకు దారి తీస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. బ్యాంకుల్లో అనధికారిక రుణ వసతులు కల్పించినా, నిర్లక్ష్యం జరిగినా, నగదు కొరత ఏర్పడినా, మోసానికి పాల్పడినా, ఫొర్జరీ చేసినా సంబంధిత రాష్ట్ర పోలీసులకు నివేదించేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలు అనుసరించాల్సిందేనని నిపుణులు అంటున్నారు.