ఇబ్బందికరమే: జీడీపీలో కరెంట్ ఖాతా లోటు రెండు శాతం
ముంబయి: డిసెంబరు త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు(సీఏడీ) జీడీపీలో రెండు శాతానికి చేరింది. అంటే 13.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇది 8 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 1.4 శాతంగా మాత్రమే ఉంది. అధిక వాణిజ్య లోటు కారణంగా కరెంట్ ఖాతా లోటు పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు చెబుతున్నాయి.
విదేశీ మారక ఆదాయం, వ్యయాలకు మధ్య అంతరాన్ని కరెంట్ ఖాతా లోటు అంటారన్న సంగతి తెలిసిందే. ఇది సెప్టెంబర్ - డిసంబర్ మధ్య త్రైమాసికంలో 7.2 బిలియన్ డాలర్లు గానీ, జీడీపీలో 1.1 శాతంగా ఉందని శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తగ్గిన నికర పోర్టుఫోలియో పెట్టుబడులు
ఏప్రిల్-డిసెంబరు 2017లో కరెంట్ ఖాతా లోటు అంతక్రితం ఏడాది ఇదేసమయంలో పోలిస్తే రెట్టింపై 0.7 శాతం నుంచి 1.9 శాతానికి చేరడం గమనార్హం. అదే సమయంలో వాణిజ్య లోటు 82.7 బిలియన్ డాలర్ల నుంచి 118.9 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు కారణమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - డిసెంబర్ 2017 మధ్య నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) 30.6 బిలియన్ డాలర్ల నుంచి 23.7 బిలియన్ డాలర్లకు తగ్గాయి. నికర పోర్ట్ఫోలియో పెట్టుబడులు మాత్రం మూడో త్రైమాసికంలో 5.3 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం విశేషం. అంతక్రితం ఏడాది ఇదే మూడు నెలల కాలంలో విక్రయాలు 11.3 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.

బ్యాంకుల్లో కీలక పోస్టులు వెంటనే నియమిస్తేనే సత్ఫలితాలు
ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ) నిర్వహణలో కీలక పాత్ర వహించే చైర్మన్, ఎండీ, డైరెక్టర్ వంటి ఉన్నత పోస్టుల్లో ఉన్న వ్యక్తులను తరచూ మార్చడంపై ఎస్బిఐ మాజీ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ మార్చినా, ఆలస్యం లేకుండా వెంటనే ఆ పోస్టుల్లో వేరే వ్యక్తులను నియమించాలన్నారు. అలా చేయకపోవడం వల్లనే పిఎస్బిల్లో పిఎన్బి వంటి కుంభకోణాలు తలెత్తుతున్నాయన్నారు. కొత్త చైర్మన్, ఎండి, డైరెక్టర్లకు బ్యాంకుపై పూర్తి అవగాహన ఏర్పడే వరకు, అప్పటి వరకు ఆ పదవుల్లో ఉన్న వ్యక్తులు కొంత కాలం పాటు కొత్త వ్యక్తులకు సహకరించడం కూడా అవసరమని ముంబై యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో భట్టాచార్య ఈ వ్యాఖ్యలు చేశారు.

సమన్వయ లోపం వల్లే పీఎన్బీ కుంభకోణమన్న అరుంధతి భట్టాచార్య
ఒక బ్యాంక్ నిర్వహణ మొత్తాన్ని రాత్రికి రాత్రి ఒక వ్యక్తికి అప్పగించి చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రశ్నించారు. పిఎన్బి ఉపయోగిస్తున్న కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ (సిబిఎస్), స్విఫ్ట్ మెసేజింగ్ ప్లాట్ఫాం మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల ఈ దురదృష్టకర సంఘటన జరిగి ఉంటుందన్నారు. ఈ లావాదేవీలు నడిపే వ్యక్తులను అతిగా నమ్మడం లేదా కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, స్విఫ్ట్ మెసేజింగ్ ప్లాట్ఫాం మధ్య తేడా ఉందనే విషయం గుర్తించక పోవడం ఈ సమస్యకు కారణమై ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications