బడ్జెట్ 2018: మాకూ పరిశ్రమ హోదా కావాలంటున్న చిల్లర వర్తకులు
న్యూఢిల్లీ: సార్వత్రిక బడ్జెట్కు కౌంట్ డౌన్ మొదలవడంతో వివిధ వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. రిటైల్ వ్యాపారులు తమకు వర్తింపజేసే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళతరం చేయాలని కోరుతున్నారు. తమకు పరిశ్రమ హోదా కల్పించాలని, తద్వారా రిటైల్ రంగానికి మరిన్ని రుణాలు, పెట్టుబడులు అందేలా వీలు కల్పించాలని ఆ రంగం ప్రతినిధులు కోరుతున్నారు. అలాగే మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపార (ఎంబీఆర్టీ) రంగానికి ఎఫ్డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల) నిబంధనలను సడలించడంతోపాటు గిడ్డంగులు, కోల్డ్ చైన్ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
బీటీసీ (బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాంప్లియంట్) వినియోగదారులకు జారీచేసే ఇన్వాయిస్లను సరళతరం చేయడంతోపాటు జీఎస్టీ రిఫండ్లను పొందేందుకు మాన్యువల్ సిగ్నేచర్, మల్టిపుల్ కాపీలను సమర్పించాలన్న నిబంధనను తప్పనిసరిగా తొలగించాలని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) డిమాండ్ చేసింది. జీఎస్టీ విషయంలో ఎదురవుతున్న అనేక సమస్యల, సవాళ్లను కేంద్రానికి వివరించడంతో పాటు వాటిని తొలగించేందుకు కొన్ని సూచనలు చేశామని ఆర్ఏఐ సీఈవో కుమార్ రాజగోపాలన్ తెలిపారు.

హెచ్ఎస్ఎన్ కోడింగ్ విధానం పూర్తిగా తొలగించాలి
సరళీకరణ ప్రక్రియలో భాగంగా హెచ్ఎస్ఎన్ కోడింగ్ విధానాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉన్నదన్నారు. పలు పత్రాలపై ఒకటి కంటే ఎక్కువ సంతకాల నిబంధనను తొలగించాల్సి ఉందని పేర్కొన్నారు. రిటైల్ పరిశ్రమకు పరిశ్రమ హోదా కల్పించడం వల్ల ఆర్థిక వ్యవస్థలోకి తేలిగ్గా చొచ్చుకువెళ్లి పెట్టుబడులు ఆకర్షించడానికి వెసులుబాటు లభిస్తుందని రాజగోపాలన్ వివరించారు. ఇతర పరిశ్రమల్లో మాదిరిగా అన్నిరకాల ప్రోత్సాహాలకు రిటైల్ పరిశ్రమలోని వారు ప్రోత్సాహాలు పొందడానికి వీలవుతుందని తేల్చి చెప్పారు. ఏపీఎంసీ చట్టంలోని నిబంధనలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉన్నదని రాజగోపాలన్ అన్నారు.రిటైల్ వ్యాపారులు తేలిగ్గా వస్తువులు పొంది, వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే విధానాన్ని అమలు చేయాలని కోరారు.

బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణం పొందే సదుపాయం కల్పించాలి
ఫ్రాంచైస్ ఇండియా చైర్మన్ గౌరవ్ మార్య స్పందిస్తూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో వినియోగదారులకు అవసరమైన సేవలు అందించేందుకు వీలుగా చిన్న రిటైల్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత పురోభివ్రుద్ది చేసేందుకు వీలుగా ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం అందించేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు. దీర్ఘకాలంలో చిన్న వ్యాపారులకు వ్యాపారం లాభదాయకమయ్యేలా వారిని ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ద్రుష్టి సారించాలన్నారు. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని మరింత చౌకగా మార్చాలని, సంప్రదాయేతర ఇంధన వనరులను వాడుతున్న వారు ప్రోత్సాహకాలు అందుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దేశీయ మార్కెట్తోపాటు విదేశీ మార్కెట్లోనూ వారు పెరిగేందుకు వెసులుబాట్లు కల్పించాలన్న డిమాండ్లు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications