మొండి బాకీల వసూళ్ల వ్యూహం: సొంత క్రిప్టోకరెన్సీ ‘లక్ష్మి’: ఇక బిట్ కాయిన్పై నిషేధమే?
న్యూఢిల్లీ / ముంబై: బిట్ కాయిన్ను నిషేధించినట్లు ఈ నెల ఒకటో తేదీన కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసినా.. దాని పూర్వాపరాలు, పర్యవసనాలపై బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు ద్రుష్టి సారించాయి. ప్రపంచ వ్యాప్తంగా బిట్కాయిన్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వర్చువల్ కరెన్సీలు విజయవంతం అయ్యాయి.
భారతదేశంతోపాటు వాటికి దీటుగా సొంత క్రిప్టోకరెన్సీ రూపకల్పనకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. నగదు రహిత లావాదేవీల్లో రూపాయికి ప్రత్యామ్నాయంగా సొంత క్రిప్టోకరెన్సీని తీసుకొచ్చేందుకు గల అవశాలను ఆర్బీఐ నిపుణులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 'లక్ష్మీ' అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ క్రిప్టోకరెన్సీని ఆవిష్కరించబోతున్నట్లు గతేడాది నుంచే వార్తలు వినిపిస్తున్నాయి.
క్రిప్టోకరెన్సీలకు అవసరమైన బ్లాక్చైన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసువడానికి వీలుగా వివిధ బ్యాంకులను, టెక్ సంస్థలను సమష్ఠిగా ముందుకు తేవడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందున్నది. తాజగా దీనిపై కాన్పెప్ట్ పేపర్ విడుదల చేస్తామని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) తెలిపింది.

మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చని బ్యాంకుల అంచనా
బ్లాక్చైన్ టెక్నాలజీని ఉపయోగించుకుని సమాచార మార్పిడి చేసుకోవడం ద్వారా మోసాలను అరికట్టడంతోపాటు మొండి బకాయిల సమస్య పరిష్కారానికి వీలవుతుందని బ్యాంకులు అభిప్రాయ పడుతున్నాయి. దీంతో వాటన్నింటిని కలసికట్టుగా ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎస్బీఐ ఇప్పటికీ ఈ విషయమై ఐబీఎం, మైక్రోసాఫ్ట్, స్కైలార్క్, కేఎంపీజీ లాంటి ఐటీ దిగ్గజాలతో పాటు పది వాణిజ్య బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నది.

బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగించుకుంటామని జైట్లీ వివరణ
క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత లేదని, కనుక వాటిని ప్రభుత్వం గుర్తించబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే పలుమార్లు ఉద్ఘాటించిన విషయం తెలిసిందే. క్రిప్టోకరెన్సీలకు తోడ్పాటునిస్తున్న బ్లాక్చైన్ టెక్నాలజీని ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఆయన ప్రకటించారు. దీంతో రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. బిట్కాయిన్ సహా ఇతర క్రిప్టోకరెన్సీల పట్ల ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది.

బిట్ కాయిన్పై నిషేధంతో ఆ లావాదేవీలన్నీ చట్టవిరుద్ధం
బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీనీ మన దేశంలో వీటిని నిషేధించేందుకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకున్నట్లు స్పష్టమవుతున్నది. ఇదే జరిగితే బిట్కాయిన్తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు, లావాదేవీలన్నీ చట్టవిరుద్ధమవుతాయి. క్రిప్టోకరెన్సీలు పన్నుల ఎగవేతకు దోహదం చేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తున్నదని, అందుకే వీటిని నిషేధించడానికి త్వరలో చట్టాన్ని తీసుకురానున్నదని అధికార వర్గాలు తెలిపాయి.

క్రెడిట్, డెబిట్ కార్డులతో బిట్ కాయిన్లు కొనొద్దని సిట్ బ్యాంక్
బిట్కాయిన్లతో పాటు ఇతర క్రిప్టోకరెన్సీల కొనుగోళ్లకు తమ డెబిడ్ కార్డులను గానీ, క్రెడిట్ కార్డులను గానీ ఉపయోగించకుండా సీటీ ఇండియా (సిటీ బ్యాంకు) మంగళవారం నిషేధం విధించింది. వర్చువల్ కరెన్సీల పట్ల రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆందోళనలను వ్యక్తం చేస్తుండటంతో ఈ చర్య చేపట్టిన సిటీ బ్యాంకు.. తమ ఖాతాదారులకు సందేశాన్ని పంపి ఈ నిషేధాన్ని తెలియజేసింది. బిట్కాయిన్లు సహా ఇతర క్రిప్టోకరెన్సీలు, వర్చువల్ కరెన్సీల కొనుగోలుకు తమ డెబిట్, క్రెడిట్ కార్డులను అనుమతించరాదని నిర్ణయించినట్లు సిటీ ఇండియా స్పష్టం చేసింది.

బ్లాక్ చైన్ టెక్నాలజీ లావాదేవీలపై కేంద్రం కసరత్తు
బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై త్వరలోనే కాన్సెప్ట్ పేపర్ను విడుదల చేస్తామని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎఐ) తెలిపింది. క్రిప్టో ఆస్తుల క్రయ, విక్రయాల విషయమై పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు, త్వరలోనే పత్రం విడుదల చేస్తామని ఐసీఎఐ ప్రెసిడెంట్ ఎన్డి గుప్తా తెలిపారు. బిట్కాయిన్లో పెట్టుబడులపై ఇటీవల ఆందోళనలు పెరిగాయి. గత ఏడాది వందల రెట్లు పెరిగిన బిట్కాయిన్ విలువ.. గతేడాది డిసెంబర్ నుంచే భారీగా పతనమైంది. పైగా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ విలువ తీవ్ర ఊగిసలాటలకు లోనవుతోంది. క్రిప్టో కరెన్సీల నియంత్రణకు ఇప్పటివరకు భారత్లో అధికారిక వ్యవస్థ అంటూ ఏమీ లేదు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అధ్యక్షత ఏర్పాటైన కమిటీ ఒకటి వీటిపై అధ్యయనం జరుపుతోంది. తాజాగా ఐసీఎఐ కూడా వీటిని విశ్లేషిస్తోంది. అంతేకాదు, బిట్కాయిన్, బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఆధారిత లావాదేవీల కోసం అకౌంటింగ్, ఆడిటింగ్ ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications