మొండి బకాయిలను రద్దులో అగ్రస్థానంలో ఎస్బిఐ
న్యూఢిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.81,683 కోట్లు మొండి బకాయిలను రద్దు చేశారు.వీటిలో అత్యధికంగా ఎస్బీఐ రూ 20,339 కోట్లను రాని బాకీలను రద్దు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు మొండి బకాయిలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నాయి.
2012-13లో పీఎస్యూ బ్యాంకులు రద్దు చేసిన మొత్తం రూ 27,231 కోట్లుగా నమోదైంది. గత ఐదేళ్లలో దాదాపు మూడు రెట్లు అధికంగా మొండి బాకీలను ప్రభుత్వ రంగ బ్యాంకులు తాజాగా రద్దుల పద్దుల చేర్చాయి. ఎస్బీఐతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2016-17లో రూ 9205 కోట్లను, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ 7346 కోట్లు, కెనరా బ్యాంక్ రూ 5,545 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ 4348 కోట్ల మేర రాని బాకీలను రద్దు చేశాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో బ్యాంకులు రద్దు చేసిన రుణాల మొత్తం రూ 53,625 కోట్లకు పెరిగింది.

ఆర్బీఐ అంచనాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ 15 శాతానికి పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. బ్యాంకులు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో పీఎస్యూ బ్యాంకులకు రానున్న రెండేళ్లలో రూ 2.11 లక్షల కోట్ల మూలధనం సమీకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
సామాన్యులకు రుణాలు మంజూరు చేసేందుకు ఇబ్బందులు పెట్టే బ్యాంకర్లు బడా బాబులకు మాత్రం కోట్లాది రూపాయాలను సులభంగా ఇస్తున్నాయి. అయితే బ్యాంకుల నుండి రుణాలు తీసుకొన్న బడా బాబులు మాత్రం బ్యాంకులకు రుణాలు చెల్లించకున్నా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడ లేకపోలేదు.












Click it and Unblock the Notifications