silver సునామీ.. రాకెట్లా దూసుకెళ్తున్న రేట్లు! ఇప్పుడు కొనడం సురక్షితమేనా?
వ్యాపార ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వెండి ముచ్చటే నడుస్తోంది. ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏకంగా 20 శాతానికి పైగా లాభాలను అందించి, ఇన్వెస్టర్లకు నిజంగానే 'వెండి పంట' పండించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (సుమారు 31.1 గ్రాములు) వెండి ధర ఏకంగా 69.71 డాలర్ల మార్కును తాకింది. గత జూన్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మన దేశంలోనూ అదే జోరు కనిపిస్తోంది. ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కిలో వెండి ధర 2,44,000 రూపాయల దాకా పెరిగి రికార్డు స్థాయి వైపు దూసుకెళ్తోంది. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయిలో మెరవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి.
వెండి ధరలు ఈ స్థాయిలో రాకెట్ వేగంతో పెరగడానికి అంతర్జాతీయంగా చోటుచేసుకున్న మార్పులే ప్రధాన కారణం. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు, డాలర్ విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణంపై వస్తున్న ఆందోళనలు వెండికి కొత్త కాంతినిచ్చాయి. వీటికి తోడు పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోంది. సాధారణంగా బంగారం ధరలు పెరిగితే, సురక్షితమైన పెట్టుబడిగా భావించి ఇన్వెస్టర్లు వెండి వైపు కూడా మొగ్గు చూపుతారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల అప్పులు పెరుగుతుండటం కూడా లోహాల మార్కెట్కు బాగా కలసివచ్చింది.

కేవలం అలంకారమే కాదు.. పరిశ్రమల ప్రాణం!
బంగారంతో పోలిస్తే వెండికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది కేవలం దాచుకునే ఆభరణం మాత్రమే కాదు, పారిశ్రామికంగానూ దీనికి విపరీతమైన గిరాకీ ఉంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఈవీ వాహనాలు, హైటెక్ టెక్నాలజీ తయారీలో వెండి పాత్ర అత్యంత కీలకం. ఒకవైపు వీటికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటం, మరోవైపు మార్కెట్లో వెండి సరఫరా తగినంత లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, ఇండస్ట్రియల్ డిమాండ్ రెండూ ఒకేసారి తోడవడంతో వెండి ధర వేగంగా పుంజుకుంది.
కొత్తగా కొనేవారు తొందరపడొద్దు!
ఒక్క నెలలోనే 20 శాతం పెరిగింది కదా అని ఇప్పుడు ఆశపడి వెంటనే కొత్తగా పెద్దమొత్తంలో వెండిని కొనడం ప్రమాదకరమని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం కంటే వెండిలో హెచ్చుతగ్గులు చాలా వేగంగా ఉంటాయి. ఒక్కసారిగా పెరిగినట్లే అంతే వేగంగా తగ్గే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రస్తుతం వెండి ఉన్నవారు దానిని అలాగే హోల్డ్ చేయడం మంచిదని, కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఒక్కసారిగా కాకుండా 'సిప్' పద్ధతిలో అంటే ధర తగ్గినప్పుడల్లా కొద్దికొద్దిగా కొనుగోలు చేయడం సురక్షితమని సూచిస్తున్నారు.
ముందుంది అసలైన పరీక్ష!
రాబోయే రోజుల్లో వెండి ఏ వైపు పయనిస్తుందనేది అంతర్జాతీయంగా 70 డాలర్ల మార్కుపై ఆధారపడి ఉంటుంది. 70 డాలర్ల స్థాయిని దాటి నిలకడగా ఉంటే ఈ బుల్ జోరు మరికొన్నాళ్లు కొనసాగుతుంది. లేకపోతే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఉంది, అప్పుడు ధరలు కాస్త తగ్గుతాయి. మన దేశీయ మార్కెట్ పరంగా చూస్తే కిలో వెండికి రూ. 2,55,000 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ తగ్గితే రూ. 2,38,000 నుంచి రూ. 2,35,000 వరకు సపోర్ట్ లభించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.














Click it and Unblock the Notifications