సామాన్యుడికి కేంద్రం తీపి కబురు: పొదుపుపై వడ్డీరేట్ల పెంపు
న్యూఢిల్లీ: చిన్నతరహా పొదుపు ఖాతాల్లో మదుపు చేసే సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై 0.4శాతం వడ్డీరేట్లను పెంచుతూ గురువారం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పోస్టాఫీసు టైం డిపాజిట్లపై అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
సొంత కారు లేదు, చేతిలో రూ.50వేలు కూడా లేవు!: మోడీ ఆస్తులెంతో తెలుసా?
చిన్న మొత్తాల పథకాల వడ్డీ రేట్లను 30-30 బేసిస్ పాయింట్ల మేర పెంచినట్లు(ఒక్క శాతం 100బేసిస్ పాయింట్లకు సమానం) ఆర్థిక శాఖ వెల్లడించింది. పోస్టల్ సేవింగ్స్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకాలు, పీపీఎఫ్లలో తాజా పెట్టుబడులు దాదాపుగా లేవని ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
జనవరి-మార్చి త్రైమాసికానికి వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్థిక శాఖ.. గత రెండు త్రైమాసికాల్లో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. తాజాగా, అమల్లోకి వచ్చిన ఆర్థిక శాఖ ఉత్తర్వులతో ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలానికి 6.9శాతం, 7శాతం, 7.2శాతం చొప్పున డిపాజిట్లపై ఇండియన్ పోస్ట్ వడ్డీ రేట్లను అందించనుంది.
జీతాల పెంపు: అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ప్రధాని మోడీ తీపి కబురు
కాగా, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలకు వడ్డీరేట్లను 40బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారికి వరుసగా 8శాతం, 8.5శాతం చొప్పున వడ్డీ చెల్లించనున్నారు. ఐదేళ్ల కాలపరిమితితో ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో అక్టోబర్ 1 నుంచి 8.7శాతం వడ్డీ చెల్లిస్తారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కోసం ఏడాదికి 8శాతం, కిసాన్ వికాస్ పత్రాలకు 7.7శాతం చొప్పున వడ్డీ ఇవ్వనున్నారు.