Stock Market : స్టాక్ మార్కెట్ కళకళ.. మదుపర్లకు కాసుల పంట!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దుమ్మురేపాయి! వరుసగా రెండో రోజూ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఫైనాన్షియల్ , మెటల్ రంగాలలో కొనుగోళ్ల జోరుతో మార్కెట్ కళకళలాడింది. సెన్సెక్స్ ఏకంగా 1131 పాయింట్లు ఎగిసి, 75,301 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 325 పాయింట్లు లాభపడి 22,834 వద్ద స్థిరపడింది. ఒక్క సెషన్లోనే మదుపర్ల సంపద ఏకంగా రూ. 6.85 లక్షల కోట్లు పెరిగింది.
మార్కెట్ లో పండగ వాతావరణం..
ఉదయం నుంచే ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్ రోజంతా అదే జోరు కొనసాగించింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 1200 పాయింట్లు లాభపడటం ట్రేడర్లను ఆశ్చర్యపరిచింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగియడంతో మదుపర్ల ఆనందానికి అవధుల్లేవు. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్క సెషన్లోనే రూ. 400 లక్షల కోట్లకు చేరుకుంది. గత కొంతకాలంగా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో చాలా కంపెనీల స్టాక్స్ తక్కువ ధరలకు లభిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. స్టాక్స్ ఆకర్షణీయమైన ధరల్లో ఉండటంతో మళ్లీ కొనుగోళ్లు మొదలయ్యాయి.

లాభాల పంట పండించిన స్టాక్స్ ఇవే!
సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎల్అండ్టీ షేర్లు దుమ్మురేపాయి. ముఖ్యంగా ఈ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరగడంతో సూచీలు పైకి దూసుకెళ్లాయి. అయితే బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజాలు స్వల్పంగా నష్టాలను మూటగట్టుకున్నాయి. అటు రూపాయి కూడా డాలర్తో పోలిస్తే 27 పైసలు బలపడి 86.54 వద్ద ట్రేడ్ అవుతోంది.
గ్లోబల్ మార్కెట్ల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ఊతంతో దేశీయ మార్కెట్ జోరు పెంచింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు సైతం అదే బాటలో పయనించడం కలిసొచ్చింది. చైనా ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలతో హాంకాంగ్ మార్కెట్ హాంగ్ సెంగ్ ఏకంగా 2 శాతం లాభంతో మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది.
మార్కెట్ ర్యాలీకి కారణాలు ఇవే!
భారత వాణిజ్య లోటు మూడున్నర ఏళ్ల కనిష్టానికి పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్ను మరింత బలపరిచింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే సంకేతాలను ఇచ్చింది. అటు అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. వినియోగాన్ని పెంచేందుకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడంతో మెటల్ డిమాండ్ పెరుగుతుందని అంచనాలు వెలువడ్డాయి. దీంతో మెటల్ స్టాక్స్లో భారీ కొనుగోళ్లు జరిగాయి.












Click it and Unblock the Notifications