డీజీల్ వాహనాలపై 2 శాతం పన్ను పెంపు, తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల పన్ను
న్యూఢిల్లీ: డీజీల్ వాహనాలపై 2 శాతం పన్నును విధించాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. దీంతో డీజీల్ వాహనాలు మరింత భారం కానున్నాయి. ఇదిలా ఉంటే విద్యుత్ వాహనాలపై పన్నులను తగ్గించాలని కేంద్రం ప్రతిపాదించింది.ఈ మేరకు ఓ సర్క్యులర్ను జారీ చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గాను కేంద్రప్రభుత్వం ఈ మేరకు డీజీల్ వాహనాలపై రెండు శాతం పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకొంది. 4 మీటర్ల కంటే తక్కువ పొడవు, 1.5 లీటర్ల కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల డీజిల్ కార్లపై 31శాతం పన్ను ఉంది. తాజాగా పెంచిన పన్నులతో డీజీల్ వాహనాలపై పన్ను శాతం 33కు పెరిగింది.
ఇక ఆటోమొబైల్ రంగంలోనే అత్యధిక పన్నులు గల ఎస్యూవీలు మరింత పెరిగే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనలతో ఎస్యూవీలపై పన్ను 52శాతానికి పెరగనుంది. ఇక మిడ్సైజ్ కార్లపై 47శాతం, లగ్జరీ కార్లపై 50శాతం పన్ను వేయనున్నారు.
మారుతి సుజుకీ స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ ఐ20, ఎస్యూవీల్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్, మారుతి సుజుకీ విటారా బ్రెజా, సబ్ కాంపాక్ట్ సెడాన్ అన్ని రేంజ్ల్లోని మోడళ్లపై ఈ పెంపు ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులను మరింత తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం వీటిపై 12శాతం పన్ను ఉంది. దీన్ని మరింత తగ్గిస్తే వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అయితే ఎంత మేరకు పన్నులను తగ్గిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.