జైట్లీజీ! కార్పొరేట్ పన్నుతగ్గించాలి.. ‘చమురుకు’ మౌలిక వసతి కల్పించాలి
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో కార్పొరేట్ పన్నును తగ్గించడంతోపాటు వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)పై ఉన్న ఆంక్షలను తొలిగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని బ్రిటన్, ఇండియా వ్యాపార మండలి (యూకేఐబీసీ), బిట్రీష్ పరిశ్రమల సమాఖ్య (సీబీఐ) కోరాయి. భారత్లో బ్రిటన్ పెట్టుబడులను ప్రోత్సహించేలా సరళతరమైన, ఆమోద యోగ్యమైన పన్ను విధానాలు తీసుకు రావాలని కోరాయి. కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టాలని కూడా సూచించాయి. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని యూకేఐబీసీ సీవోవో కెవిన్ మెక్కోలే అన్నారు.
దేశీయ ఇంధన అవసరాలు ప్రస్తుతం 80 శాతం పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిపైనే ఆధార పడి ఉన్నాయి. దీన్ని క్రమంగా తగ్గించుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలంటే దేశీయంగా ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలంటే ఈ రంగానికి 'మౌలిక వసతుల' పరిశ్రమ హోదా కల్పించాలన్న అభ్యర్థనలు వెలువడుతున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలన్న సూచనలు వస్తున్నాయి.
కార్పొరేట్ పన్ను తగ్గింపుపై యూకేఐబీసీ ఇలా
‘భారతదేశంలో బ్రిటన్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఊహించినదానికన్నా సరళంగా పన్నుల వ్యవస్థను రూపొందించాలి. నిబంధనలను సరళతరం చేయాలి. కార్పొరేట్ పన్ను తగ్గించాలి. సులభ వాణిజ్య పద్ధతులను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరాం' అని బ్రిటన్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ సీఈఓ కెల్విన్ మెక్ కోలే చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే బ్రిటన్ భారతదేశంలోన భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నది. జీ - 20 దేశాల్లో అత్యధికంగా భారతదేశంలో పెట్టుబడి పెడుతున్న దేశం బ్రిటన్. సుమారు 2400 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అదే సమయంలో భారతదేశంలోని విదేశీ సంస్థల పెట్టుబడుల్లో బ్రిటన్ పారిశ్రామిక సంస్థలది నాలుగో స్థానం. గతంతో పోలిస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచీ (ఈఓడీబీ)లో భారత్ 130 పాయింట్ల నుంచి 100 పాయింట్లకు ఎగబాకింది. ఇది భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహకరమైన చర్య. ప్రస్తుతం భారత్, బ్రిటన్ వ్యాపార, వాణిజ్య సంబంధాలు చాలా సమర్థవంతంగా ఉన్నాయి.
Recommended Video
కార్మిక సంస్కరణలతో మరిన్ని పెట్టుబడులకు చాన్స్
సమీప భవిష్యత్లో విస్తరణకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టే సంస్కరణల పట్ల బ్రిటన్ వ్యాపార వాణిజ్యవేత్తలు సానుకూలంగా స్పందిస్తారు. ప్రభుత్వాలు చేసే ప్రయత్నాల కంటే ఎక్కువ ర్యాంకు సాదించిందని తెలుస్తున్నదని మెక్ కోలే చెప్పారు. కార్మిక రంగ సంస్కరణలు అమలు చేయడం ద్వారా భారీ స్థాయిలో బ్రిటన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు మెరుగు పర్చాలని కోరుతున్నారు. బ్రిటన్ కంపెనీలు పెట్టుబడి పెట్టిన సంస్థల్లో 7.8 లక్షల మంది ఉద్యోగం పొందుతున్నారు. దేశీయంగా సంఘటిత రంగంలో ఉద్యోగావకాశాలు పొందిన భారతీయుల్లో వీరిది 5.5 శాతంగా ఉంది.
చమురు రంగానికి మౌలిక హోదా కల్పించాలి
వేదాంత కెయిన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ సీఈఓ సుధీర్ మాథూర్ స్పందిస్తూ ‘అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్లను దాటింది. భారత్ ఇంధన అవసరాలు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడ్డ నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యం రాబోయే బడ్జెట్లో ఓ సవాలే. 2018కి చమురు దిగుమతుల బిల్లు రూ.5 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ధరలు పెరిగితే ఇది మరింత పెరుగడం ఖాయం' అని చెప్పారు. జీఈఈసీఎల్ ఎండీ కమ్ సీఈఓ ప్రశాంత్ మోదీ మాట్లాడుతూ ‘దేశంలో చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ (ఈఅండ్పీ)రంగానికి మౌలిక హోదా కల్పించాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. ఎప్పట్నుంచో ఉన్నందున ఈసారైనా దీన్ని పరిశీలించాలి. జీఎస్టీలోకి సహజ వాయువును తెస్తే లాభదాయకంగా ఉంటుంది' అని స్పష్టం చేశారు. రాబోయే బడ్జెట్లో పన్నులను తగ్గించాలని చమురు, గ్యాస్ పరిశ్రమ కోరుతున్నది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తికి ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలుండాల్సిన అవసరం ఎంతో ఉందంటున్నది.
2022 నాటికి దిగుమతులు తగ్గించాలని మోదీ లక్ష్యం
ప్రస్తుతం దేశ ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అవుతున్న చమురుపై పన్నులను తగ్గిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. చమురు, గ్యాస్ రంగానికి మౌలిక పరిశ్రమ హోదా ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్న పరిశ్రమ.. ఇది సాకారమైతే దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుందని, దిగుమతులు తగ్గిపోతాయని చెబుతున్నది. 2022 నాటికి దేశంలోకి విదేశీ చమురు దిగుమతులను 10 శాతానికి తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని పరిశ్రమ వర్గాలు జైట్లీకి గుర్తుచేస్తున్నాయి. ఈ లక్ష్యంలో భాగంగానే విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తున్నది తెలిసిందే.