Chennai Rains : చెన్నై సహా నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు స్కూళ్లు, ఆఫీసుల మూసివేత
తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలతో నాలుగు జిల్లాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో చెన్నె, కాంచీపురం, చెంగల్ పట్టు, తిరువళ్లూరు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లను మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నాలుగు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని స్కూళ్లు, ఆఫీసులు మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. అలాగే ట్రాఫిక్ స్తంభించి, విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. ఐఎండీ తాజా నివేదికల ప్రకారం, చెన్నై, పరిసర ప్రాంతాల్లో గత కొన్ని గంటల్లో వర్షాలు ఆగిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఇప్పటికీ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
డీజీపీ కార్యాలయం, నుంగంబాక్కం సమీపంలోని రెండు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది, నాలుగు చోట్ల 19 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నీటి ఎద్దడి కారణంగా మొత్తం నాలుగు సబ్వేలను మూసివేశారు. అంతకుముందు, తిరువళ్లూరు కలెక్టర్ తన ట్వీట్లో పరివాహక ప్రాంతాల్లో నిరంతర వర్షం, ఇన్ఫ్లో కారణంగా రెడ్హిల్స్ ట్యాంక్ నుండి ముందుజాగ్రత్త చర్యగా 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.ఇన్ఫ్లో సుమారు 2000 క్యూసెక్కులు ఉందన్నారు. మిగులు ఛానల్ ఒడ్డున లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కార్యాలయంలోని వరద కంట్రోల్ రూమ్ ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. నాలుగు జిల్లాల అధికారులు ఈ రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు ఇచ్చారు.