ప్రతిపక్ష పార్టీలో చీలికపై హైకోర్టు సంచలన తీర్పు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే చీలికపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువడించింది. పార్టీలో ద్వినాయకత్వాన్ని కొనసాగించడంపై ఇదివరకు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశాన్ని రద్దు చేసింది. దీన్ని గుర్తించట్లేదని పేర్కొంది. కొత్తగా మళ్లీ జనరల్ కౌన్సిల్ భేటీని నిర్వహించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలు మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, ఆయన వర్గానికి ఊరట ఇచ్చినట్టయింది.
ద్వినాయకత్వానికి తెరదించి, పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ను భర్తీ చేసేలా తీర్మానం చేయడానికి కిందటి నెలలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ విషయం మీద మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య విభేదాలు తలెత్తాయి. అవి కాస్తా చిలికి చిలికి గాలీవానగా మారాయి. కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. పన్నీర్ సెల్వం, ఆయన వర్గానికి పార్టీలో చోటు దక్కలేదు. ఒకరకంగా ఆయనను బహిష్కరించింది పళనిస్వామి వర్గం.
పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో కూడిన ద్వినాయకత్వాన్ని స్వస్తి పలికి.. ప్రధాన కార్యదర్శి పోస్ట్ను భర్తీ చేసేలా బైలాస్లో మార్పులు చేయాలంటూ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించాలని పార్టీ నిర్ణయించగా.. అది బెడిసి కొట్టింది. పన్నీర్ సెల్వం వర్గం ఈ మార్పులు చేయడాన్ని వ్యతిరేకించింది. ద్వినాయకత్వాన్ని రద్దు చేయడంతో పాటు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి అపాయింట్ అయ్యారు. దీనికి సంబంధించిన తీర్మానాలన్నింటినీ ఆమోదించింది అప్పటి సర్వసభ్య సమావేశం.
ఆ తీర్మానాలను సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా తన తీర్పును వెలువడించింది హైకోర్టు. స్టేటస్ కో ఇచ్చింది. జూన్ 23కు ముందు నాటి పరిస్థితులను పార్టీలో కొనసాగించాలని ఆదేశించింది. అలాగే పన్నీర్ సెల్వం, ఆయన వర్గానికి అవకాశం ఇవ్వకుండా నిర్వహించిన జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని గుర్తించట్లేదని స్పష్టం చేసింది. తీర్మానాలను ఆమోదించుకోవడానికి కొత్తగా కౌన్సిల్ భేటీని జరపాలని ఆదేశించింది.
తీర్పు పన్నీర్ సెల్వానికి అనుకూలంగా రావడంతో ఆయన వర్గీయుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమౌతోన్నాయి. చెన్నైలోని ఆయన నివాసానికి అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాణాసంచా కాల్చుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పళనిస్వామికి చెంపపెట్టుగా అభివర్ణించారు.