ఒంటరిగా వచ్చినా సరే.. కూటమి కట్టినా సరే- మరో 20 ఏళ్లు ఆయనే సీఎం..!!
చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకే అధినేతగా పగ్గాలను అందుకోవడం వరుసగా రెండోసారి. ఈ ఉదయం చెన్నైలో ఏర్పాటు చేసిన డీఎంకే సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ ప్రక్రియ పూర్తయింది. స్టాలిన్తో పాటు ఇతర కార్యవర్గ సభ్యుల ఎన్నిక కూడా ముగిసింది. ప్రధాన కార్యదర్శి, కోశాధికారి సహా పలు అనుబంధ విభాగాలకు సంబంధించిన నియామకాలు పూర్తయ్యాయి.
డీఎంకే ప్రధాన కార్యదర్శిగా దురై మురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఎన్నికయ్యారు. పార్టీకి సంబంధించిన కీలక పదవులను ఈ ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వరుసగా ఇది రెండోసారి. ఎంపీ కణిమోళి పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నామినేట్ అయ్యారు. ఇదివరకు ఈ హోదాలో సుబ్బులక్ష్మి జగదీశన్ పని చేశారు. కిందటి నెలలో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. సుబ్బులక్ష్మి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి కణిమోళి నామినేట్ అయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన పార్టీ సమావేశంలో సెక్రెటరీ జనరల్ పెరియసామి మాట్లాడారు. మరో 20 సంవత్సరాల పాటు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ తాము గెలిచి తీరుతామనే ఆత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏఐఏడీఎంకే-భారతీయ జనత పార్టీ కూటమికి పెరియసామి సవాల్ విసిరారు. కూటమి కట్టినా సరే.. వేర్వేరుగా పోటీ చేసినా సరే.. విజయం సాధించేది తామేనని అన్నారు.
తాము ఒంటరిగా పోటీ చేసి, లోక్సభ ఎన్నికల్లో అందరినీ ఓడించగలమని స్పష్టం చేశారు. బీజేపీ,-అన్నాడీఎంకే కూటమికి తాను సవాల్ విసురుతున్నానని, దీన్ని స్వీకరించగలరా? అని ఛాలెంజ్ చేశారాయన. స్టాలిన్ మరో 20 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగుతారని తేల్చి చెప్పారు. ఇది తన ఒక్కడి కోరిక మాత్రమే కాదని, ప్రతి తమిళుడూ స్టాలిన్ను ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు చూడాలని ఆకాంక్షిస్తోన్నారని అన్నారు.
2018లో కరుణానిధి మరణానంతరం డీఎంకే అధినేతగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1969లో కరుణానిధి మొట్ట మొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. డీఎంకేలో అధ్యక్ష పదవిని ఏర్పాటు చేయడం అదే తొలిసారి. 1949లో స్థాపించిన డీఎంకేకు ద్రవిడ ఉద్యమ నేత, వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1969లో అన్నాదురై మరణించేంత వరకు ఆ పదవిలో ఆయనే కొనసాగారు. అన్నాదురై తరువాత అధ్యక్ష పదవిని ఏర్పాటుచేశారు. కరుణానిధి అధ్యక్షుడు అయ్యారు.