ఉద్యోగం కోసం ఆస్పత్రిలోనే పరీక్ష రాసిన కరోనా బాధితుడు!
చిత్తూరు: కరోనా మహమ్మారి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా.. అటూ ప్రజలు, ఇటు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, జిల్లాలో కరోనా చికిత్స పొందుతున్న ఓ బాధితుడితో మంగళవారం పరీక్ష రాయించడం గమనార్హం.
చిత్తూరు జిల్లా క్షయ విభాగంలోని ఆర్ఎన్టీసీపీ కింద కొన్ని ఉద్యోగాల కోసం గత సంవత్సర నోటిఫికేషన్ను విడుదల చేశారు. ప్రక్రియ అప్పట్లోనే పూర్తయినా.. ఒకరిద్దరికి ఉద్యోగాలు రాలేదనే కారణాలతో నోటిఫికేషన్ రద్దు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్లో పలు మార్పులు చేసి మరోసారి విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్కు సంబంధించి మంగళవారం పరీక్షలు నిర్వహించారు. ఉద్యోగం కోసం జిల్లా క్షయ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే ఓ ఉద్యోగి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతడు కరోనా బారినపడి ప్రస్తుతం చిత్తూరు జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
కాగా, జిల్లా కరోనా ఆస్పత్రి ఆవరణలోని మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం నిర్వహించిన పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఘటనపై జిల్లా క్షయ నివారణ విభాగం అధికారి రమేష్ బాబు మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం అతనికి ట్రూనాట్లో పరీక్షించగా కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అంతేగాక, డీఎంహెచ్ఓ ఆదేశాలతోనే పరీక్షకు అనుమతించామని వివరణ ఇచ్చారు.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 58,668 కరోనా కేసులు నమోదు కాగా,
32,336 మంది కరోనాతో బాధపడుతున్నారు. 25,574 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 758 మంది మృతి చెందారు.












Click it and Unblock the Notifications