ఏపీలో మరో ఘోరం: శ్రీరామతీర్థ సేవాశ్రమంలో అచ్యుతానందగిరి స్వామి దారుణ హత్య
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పలు హిందూ దేవాలయాలపై దాడులు చేసి విగ్రహాలను విధ్వంసం చేయగా.. తాజాగా కొందరు దుండగులు శ్రీరామతీర్థ సేవాశ్రమ నిర్వాహకులు అచ్యుతానందగిరి స్వామీ(65)ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం గుండ్లపల్లెలో చోటు చేసుకుంది

శ్రీరామతీర్థ సేవాశ్రమ నిర్వాహకులుగా అచ్యుతానందగిరి స్వామి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపల్లె వద్ద గత 50 సంవత్సరాలుగా శ్రీరామతీర్థ సేవాశ్రమం ఉంది. అప్పట్లో ఈ ఆశ్రమానికి శాంతానంద స్వామి నిర్వాహకుడిగా ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అరగొండ పైమాఘం గ్రామానికి చెందిన పూర్ణచంద్రారెడ్డి అలియాస్ అచ్యుతానందగిరి స్వామి.. శాంతానందస్వామి వద్ద శిశ్యుడిగా చేరారు. శాంతానంద స్వామి మరణాంతరం అచ్యుతానందగిరి స్వామి ఆశ్రమ నిర్వాహకులుగా బాధ్యతలు చేపట్టారు. ఆయన వద్ద పాకాల మండలానికి చెందిన ఓ వృద్ధురాలు(60) 13ఏళ్లుగా శిశ్యురాలిగా ఉంటున్నారు.

స్వామిజీ గొంతునులమి చంపేశాడు.. వృద్ధురాలిపైనా..
గత కొద్ది కాలంగా వీరిద్దరే ఆశ్రమంలో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి వారిద్దరూ భోజనం ముగించుకుని వారివారి గదుల్లో నిద్రించేందుకు వెళ్లారు. అయితే, కొద్దిసేపటికే స్వామిజీ గది నుంచి పెద్దగా శబ్దం రావడంతో వృద్ధురాలు అక్కడకు వెళ్లి చూడగా.. అప్పటికే స్వామిజీ కాళ్లు, చేతులు కొట్టుకుంటూ కనిపించారు. చీకట్లో ఏం జరిగిందో అర్థంకాక పరిసరాల్లో ఆమె గాలించారు. కాగా, ఓ ఆగంతకుడు వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో.. పక్కనేపడివున్న స్వామిజీని గొంతునులిమి చంపేశాడు. దీంతో భయపడిపోయిన వృద్ధురాలు పక్కనే ఉన్న మామిడితోడలోకి పారిపోయి ఉదయం వరకూ అక్కడే ఉండిపోయింది.

ఘటనా స్థలంలో పర్సు.. దర్యాప్తు ప్రారంభం..
బుధవారం ఉదయం ఆశ్రమానికి చేరుకుని స్వామిజీని దుండగులు హత్య చేసిన విషయాన్ని పేయన్నగారిపల్లెకు చెందిన భక్తుడు రెడ్డెప్పరెడ్డికి తెలిపింది. దీంతో పరిసర గ్రామస్తులు ఆశ్రమానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. జాగిలాలు ఘటనా స్థలం నుంచి పీలేరువైపు వెళ్లాయని పోలీసులు చెప్పారు.
కాగా, స్వామిజీ హత్య జరిగిన స్థలం నుంచి కొంత దూరంలో స్థానికులు ఓ పర్సును గుర్తించి పోలీసులకు అందించారు. అందులో ఏటీఎం కార్డు, కొన్ని ఫొటోలు, ఫోన్ నెంబర్లు ఉన్నట్లు తెలిసింది. దీని ఆధారంగా కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. రెడ్డప్పరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్వామిజీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వామిజీ హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. అచ్యుతానందగిరి స్వామిజీ అంత్యక్రియలను గురువారం నిర్వహిస్తామని భక్తులు తెలిపారు.












Click it and Unblock the Notifications