వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని కలిసిన మోహన్ బాబు
చిత్తూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చంద్రగిరి శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రముఖ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఆయన తండ్రి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. భాస్కర్ రెడ్డి తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి కన్నుమూసిన విషయం తెలుసుకున్న వెంటనే మోహన్ బాబు హుటాహుటిన నివాసానికి బయలుదేరి వెళ్లారు. చెవిరెడ్డిని పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం- ఇక తాడిపత్రి కేంద్రంగా..!!
సుబ్రహ్మణ్యం రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంతో మోహన్ బాబుకు ముందు నుంచీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా ఒకే జిల్లాకు చెందిన వారు కావడం, ఒకే పార్టీలో కలిసి పని చేయడం ఆ అనుబంధాన్ని మరింత పెంచింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోహన్ బాబు, ఆయన కుమారుడు, నటుడు మంచు విష్ణు.. చంద్రగిరి నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం సైతం చేశారు.
సుబ్రహ్మణ్యం రెడ్డి కొంత కాలంగా శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం చికిత్స తీసుకున్నప్పటికీ.. ఆరోగ్యం కుదుటపడలేదు. ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు ఏర్పడటంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
సుబ్రహ్మణ్యం రెడ్డి మృతి పట్ల చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆర్ కే రోజా సంతాపం తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పని చేసినందు వల్ల చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.