ఆర్మీ హెలికాప్టర్ క్రాష్: bipin rawatతోపాటు ఏపీ వాసి లాన్స్ నాయక్ సాయి తేజ మృతి
చెన్నై/చిత్తూరు: తమిళనాడులో కూలిన రక్షణ శాఖ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తోపాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కురబలకోట మండల వాసి కూడా ఉన్నారు.
Recommended Video
సాయితేజ స్వగ్రామంలో విషాద ఛాయలు
ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణ శాఖలో లాన్స్ నాయక్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా సాయితేజ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాయితేజ 2013లో ఆర్మీలో చేరారు.
ఈ ఉదయమే భార్యతో మాట్లాడిన సాయితేజ
చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ స్వగ్రామానికి వెళ్లారు. ఈ రోజు ఉదయం తన భార్యతో సాయితేజ ఫోన్లో మాట్లాడినట్లు సాయితేజ బాబాయ్ సుదర్శన్ తెలిపారు. బుధవారం ఉదయం 8.45 గంటలకు సాయితేజ వీడియో కాల్ చేసి భార్య, కుమార్తె, కుమారుడితో మాట్లాడారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం కుటుంబసభ్యుల్లో తీరని శోకాన్ని నింపింది. సాయితేజ మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఆర్మీహెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రకటించింది. ఘటనలో రావత్తో పాటు ఆయన భార్య సహా 13 మంది చనిపోయారంటూ ఐఏఎఫ్ ట్వీట్ చేసింది.
ఇటీవలే సీడీఎస్ పర్సనల్ సెక్యూరిటీ టీంలోకి సాయితేజ
కాగా, సాయితేజ 2013లో బెంగళూరు రెజిమెంట్ నుంచి ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. సిపాయిగా పనిచేస్తూనే ఏడాది తర్వాత పారా కమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. అనంతరం 11వ పారాలో లాన్స్ నాయక్ హోదాలో పనిచేస్తున్నారు. ఏడాది క్రితం వరకు బెంగళూరులోని సిపాయిల శిక్షణా కేంద్రంలో శిక్షకుడిగా పనిచేశారు. ఇటీవలే సీడీఎస్ బిపిన్ రావత్కు వ్యక్తిగత భద్రతా బృందంలో సభ్యుడిగా నియమితులయ్యారు. సాయితేజకు భార్య శ్యామల, కుమార్తె దర్శిని, కుమారుడు మోక్ష్మజ్ఞ ఉన్నారు. ప్రస్తుతం సాయితేజ కుటుంబసభ్యులు మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్నారు.
బిపిన్ రావత్.. దేశం ఓ గొప్ప దేశభక్తుడిని కోల్పోయింది
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. బిపిన్ రావత్ తోపాటు 13 మంది మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం ఒక వీర సైనికుడిని కోల్పోయిందని, ఆయన లేని లోటు తీరనిదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ తోపాటు 11 మంది సైనికులు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. వీరంతా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడుతూ బిపిన్ రావత్ తో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నారు. జనరల్ బిపిన్ రావత్ గొప్ప సైనికుడని, నిజమైన దేశ భక్తుడని కొనియాడారు. సాయుధ దళాలను, భద్రతా యంత్రాంగాన్ని ఆధునీకరించడంలో గొప్పగా కృషి చేశారని అన్నారు. దేశానికి ఎంతో సేవ చేసిన గొప్ప వ్యక్తి మరణం తనను ఎంతగానో కలిచివేసిందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.