Chandrababu: చివరకు అమ్మను పంపించేశాడు, విజయమ్మ రాజీనామాపై చంద్రబాబు
వైసీపీ గౌరవ అధ్యక్ష పదవీకి విజయమ్మ రాజీనామా ప్రకంపనలు రేపుతోంది. సీఎం జగన్కు ఏమీ అడ్డు లేకుండా ఉండేందుకు రాజీనామా చేయించారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. నగరిలో ఆయన రోడ్షోలో పాల్గొన్నారు. రాజకీయాల కోసం జగన్ అందరినీ వాడుకుని వదిలేశారని మండిపడ్డారు. బాబాయ్ను చంపాడు.. అమ్మను పార్టీ నుంచి తరిమేశాడని ఘాటే వ్యాఖ్యలు చేశారు.
ఏం సాధించావని ప్లీనరీ పెట్టుకున్నావని ప్రశ్నించారు. ఆనాడు ముద్దులు పెట్టినప్పుడు ఎలా తిరిగావో ఇప్పుడు అలా తిరుగు చూద్దామని హెచ్చరించారు. జనాగ్రహం ఏమిటో అప్పుడు జగన్కు తెలుస్తుందన్నారు. జగన్ మద్యంలో విష పదార్థాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. జే బ్రాండ్పై వైసీపీ ప్లీనరీలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అరాచక పాలన పోవాలంటే తాను ఒక్కడినే పోరాడితే చాలదని, ప్రజలు అండగా నిలబడాలని కోరారు.
చేనేత కార్మికులకు అండగా ఉన్నానని, అధికారంలోకి రాగానే చేనేతలకు 500 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తాం అని చెప్పారు. టెక్స్టైల్ పరిశ్రమలకు అండగా ఉంటానని చెప్పారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తే సీఎం జగన్ రద్దు చేశారని మండిపడ్డారు. నగరిలో కాలుష్య నివారణకు నానో టెక్నాలజీ తీసుకొస్తానని.. డ్రైనేజీ కాలువలు కూడా తవ్వలేని వ్యక్తి, 3 రాజధానులు కడతాడట అని మండిపడ్డారు.
తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం పెట్టారు.. ఆ స్ఫూర్తితోనే అన్న క్యాంటీన్లు పెట్టానని, ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు రద్దు చేస్తారా అని అడిగారు. పేదలపై ప్రేమ, తను తెచ్చాననే కోపంతో ప్రాజెక్టులు ఆపారు. పార్టీలో ఎన్నికలు లేకుండా శాశ్వత అధ్యక్షుడుగా ప్రకటించుకున్నారని పైరయ్యారు. జగన్ నొక్కేవన్నీ ఉత్తుత్తి బటన్లే. ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారో ఆన్లైన్లో పెట్టగలరా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న సాక్షి.. ఇప్పుడు లాభాల బాటలో ఉందన్నారు.