సీఎం జగన్ వైపే కమ్మ వర్గం - చంద్రబాబు ఇలాకాలో: డిప్యూటీ సీఎం పాదాభివందనం..!!
ఏపీలో ముందస్తు ఎన్నికల హంగామా మొదలైంది. అన్ని పార్టీల నేతలు ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో సామాజిక సమీకరణాలే ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసేది. 2019 లో సీఎం జగన్ రికార్డు విజయం వెనుక సామాజిక సమీకరణాలు కీలకంగా పని చేసాయి. ఇక, ఇప్పుడు సీఎం జగన్ కు కమ్మం వర్గం దూరమైందనే ప్రచారం నడుమ ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కమ్మ వర్గం జగన్ వైపే ఉందని గ్రామస్తులు చెప్పటం..డిప్యూటీ సీఎం పాదాభివందనం వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో..
ఆసక్తి కర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరో సారి తన ప్రత్యేకత చాటుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన కమ్మ వర్గానికి చెందిన ఒక సీనియర్ సిటిజన్ కు పాదాభివందనం చేసారు. ఈ ఆసక్తికర ఘటన టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో చోటు చేసుకుంది. జిల్లాలోని పెనుమూరు మండలం మొరవకండ్రిగలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పార్టీ నేతలతో కలిసి పర్యటించారు. ప్రభుత్వ పథకాల లబ్ది దారుల ఇళ్లకు వెళ్లి..వారికి అందుతున్న సంక్షేమం గురించి ఆరా తీసారు.
కమ్మ సామాజికవర్గంలో మార్పు వచ్చిందంటూ
అందులో భాగంగా ఒక సీనియర్ సిటిజన్ ఫ్యామిలీ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న మహిళను మీకు డ్వాక్రా రుణ మాఫీ జరిగిందా అని ప్రశ్నించగా ఆ మహిళ అవునని సమాధానం ఇచ్చారు. పెన్షన్ వస్తుందా అంటూ డిప్యూటీ సీఎం వాకబు చేసారు. దీంతో, మీకా.. అక్కడే ఉన్న వ్యక్తిని చూస్తూ ఆ పెద్దాయనకా అని ప్రశ్నించారు. దీనికి స్పందనగా ఆ పెద్దాయన తనకు వస్తుందని.. తాను రైతునని పరిచయం చేసుకున్నారు. తన పేరు రాదా నాయుడు అంటూ డిప్యూటీ సీఎంకు తమకు అందుతున్న పధకాల గురించి వివరించారు. సీఎం జగన్ పాలన బాగుందని..ఆయన మరోసారి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుంటుందంటూ రాధా నాయుడు చెప్పుకొచ్చారు.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాదాభివందనం
దీంతో, ఆ రైతు రాధా నాయుడుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాదాభివందనం చేసారు. దీనికి స్పందించిన రాధా నాయుడు కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ మరోసారి సీఎం కావాలని కోరారు. కమ్మ సామాజిక వర్గంలో మార్పు వచ్చిందని, ఆ వర్గం కూడా జగన్ సీఎం కావాలని కోరుకుంటుందంటూ డిప్యూటీ సీఎం పాదాభివందనం చేసారు. కమ్మ సామాజిక వర్గం వైసీపీకి దూరమైందంటూ కొంత కాలంగా సాగుతున్న ప్రచారంలో నిజం లేదని..ఆ వర్గం సీఎం జగన్ కే అండగా నిలుస్తోందనే విషయం స్పష్టమవుతోందని వివరించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పాదాభివందనం వ్యవహారం చిత్తూరు జిల్లాలో వైరల్ అవుతోంది.