జంట తుఫాన్లు: తిరుమలలో కుండపోత: సీమ జిల్లాల్లో దంచి కొట్టిన వర్షం: అన్ని చోట్లా
చిత్తూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలపై ద్రోణి ప్రభావం మరింత అధికంగా ఉంటోంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కుండపోతగా వర్షం కురిసింది. భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. గంటల పాటు వర్షం దంచి కొట్టింది. ఇదే పరిస్థితి కడప, అనంతపురం జిల్లాల్లోనూ కనిపిస్తోంది.

14, 21 తేదీల్లో
వచ్చే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. మరో రెండు తుఫాన్లు రాష్ట్రం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జంట తుఫాన్లు వచ్చే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఈ నెల 14 లేదా 15 తేదీల్లో ఒకటి, 21వ తేదీన మరో తుఫాన్ ఏర్పడటానికి అనువైన పరిస్థితులు నెలకొని ఉన్నట్లు అంచాన వేస్తోన్నారు. లా నినా వల్ల అవి ఏర్పడొచ్చని అభిప్రాయపడుతున్నారు.

లా నినా, డై పోల్
దీనితో పాటు హిందూ మహాసముద్రం డైపోల్ పరిస్థితులు కనిపిస్తుండటంతో బంగాళాఖాతంలో ఈ జంట తుఫాన్లు ఏర్పడే పరిస్థితులు నెలకొని ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తుపానులతో రాష్ట్రంలో సాధారణం కంటే అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు కానుందని చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తరాంధ్ర మీదుగా వాయువ్య గాలులు వీస్తున్నాయని. వీటి ప్రభావంతో ఈ రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయని స్పష్టం చేశారు.

తిరుమలలో
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కాగా.. కడప, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తిరుమలలో అత్యధికంగా 189 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చిత్తూరు జిల్లాలోని బీఎన్ కండ్రిగలో 139, తొట్టంబేడులో 91, సత్యవేడులో 89 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో 176, ముత్తుకూరులో 133, తడలో 109, ఇందుకూరుపేటలో 99, నెల్లూరు సిటీలో 73 మిల్లీమీటర్ల వర్షం పడింది.

సీమ జిల్లాలకు
క్రమంగా ఈ తరహా వాతావరణం కడప, అనంతపురం జిల్లాలకు విస్తరించింది. కర్నూలు జిల్లాపైనా దీని ప్రభావం కనిపిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో పలు చోట్ల ఇప్పటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో భారీ వర్షం కురిసింది. రాయదుర్గం, కల్యాణ దుర్గం, కర్నూలు జిల్లాలోని ఆలూరు, పత్తికొండ, ఆదోనిల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కావడానికి అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు.
Recommended Video

దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో
దక్షిణ కోస్తా తీరం ప్రాంతంలోని ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆగి, ఆగి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో భారీ వర్షం కురిసింది. ఈ మధ్యాహ్నం నుంచి విశాఖపట్నంలో ఓ మోస్తరు వర్షం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. కనీసం 48 గంటల పాటు ఈ తరహా వాతావరణం నెలకొని ఉంటుందని, క్రమంగా అల్పపీడన ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. వచ్చే రెండు వారాల్లో జంట తుఫాన్ల ప్రభావంతో మరిన్ని వర్షాలను ఏపీ చవి చూడొచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications