హీరా వ్యవహారంలో ఉగ్రమూలాలు?.. అధినేత్రి అరెస్ట్ తో డొంక కదిలేనా?
చిత్తూరు : హీరా గ్రూపు కుంభకోణంలో డొంక కదులుతుందా? అధినేత్రి అరెస్ట్ తో కోట్ల రూపాయల లెక్కలు తేలేనా? ఉగ్రవాదుల డిపాజిట్లు ఉన్నాయనే పోలీసుల అనుమానం నిజమేనా? ఇలాంటి ప్రశ్నలకు నౌహీరా షేక్ నోరు విప్పితే గానీ సమాధానాలు దొరకని పరిస్థితి.
చైన్ లింక్ వ్యాపారంలో కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించింది హీరా గ్రూప్. అయితే ఆ గ్రూప్ కు బాస్ గా వ్యవహరించిన నౌహీరా షేక్ కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి.
కామన్ పీపుల్ డిపాజిట్లే గాకుండా.. ఇందులో ఉగ్రవాదుల డిపాజిట్లు కూడా ఉన్నాయనేది పోలీసుల అనుమానం. దీనిపై విచారించేందుకు ఏపీ సీఐడీ పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థల సాయం కోరినట్లు సమాచారం. హీరా గ్రూప్ కుంభకోణం విలువ 8 వేల కోట్ల రూపాయలకు పైగా ఉందని అంచనా వేస్తున్నారు పోలీసులు. 8 విదేశీ బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫెమా నిబంధనలు తోసిరాజని.. సొమ్మును దేశవిదేశాలు దాటించారనే ఆరోపణలున్నాయి.