వీడియో : రాయలసీమను రతనాల సీమ చేస్తాం.. గోదావరి జలాలు ఏపీకి అందిస్తాం : కేసీఆర్
చిత్తూరు : రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి సహకరిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తమిళనాడు కాంచీపురంలోని అత్తివరదరాజ స్వామి వారి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో చిత్తూరులో ఆగారు. ఆ క్రమంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్ పలు అంశాలు ప్రస్తావించారు. గోదావరి జలాలను కృష్ణానదిలో కలపాలనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో రెండుసార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు.
రాయలసీమలో వర్షాలు పడక ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే గోదావరి జలాలను వృధాగా పోనివ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ మీకు పట్టుదలతో పనిచేసే యువనేత జగన్ సీఎంగా ఉన్నారని.. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా తామిద్దరం కలిసి నడుస్తామని.. అదే తోవలో రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

రాయలసీమను రతనాలసీమగా చేసేందుకు సహకరిస్తాం: సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/hrWI6rD8Z8
— TRS Party (@trspartyonline) August 12, 2019
కాంచీపురంలో నలభై ఏళ్లకు ఒకసారి అత్తివరదరాజ స్వామి దర్శనభాగం కల్పిస్తారు. ఆ క్రమంలో స్వామిని దర్శించుకోవడానికి సీఎం కేసీఆర్ అక్కడకు వెళ్లారు. అలా తిరుగు ప్రయాణంలో చిత్తూరులో ఆగారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఇంటికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు రోజా. దాదాపు రెండు గంటల పాటు ఆయన మా ఇంట్లో ఉన్నారు. మా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు. కలుపుగోలుగా అందర్నీ పలకరిస్తూ మా ఆతిథ్యం స్వీకరించినందుకు ధన్యవాదాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనను కుమార్తెలాగా కేసీఆర్ భావించిన తీరుతో నా జన్మధన్యమైందని చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో రాయలసీమ అభివృద్ది కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం ఆనందంగా ఉందన్నారు.


Click it and Unblock the Notifications