అర్ద్రరాత్రి అగ్నిప్రమాదం - ముగ్గురు సజీవ దహనం..!!
చిత్తూరులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకొని ముగ్గురు సజీవ దహనమయ్యారు. అర్ధరాత్రి పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో చెలరేగిన మంటలు ముగ్గురి ప్రాణాలు తీసాయి. మృతుల్లో పరిశ్రమ యజమాని భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీ బాబు, బాలాజీ అనే మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన రెండంతస్తుల భవనంలో పేపర్ ప్లేట్ల తయారీతో పాటు నిర్వాహకులు ఉంటున్నారు.
మూడంతస్తుల భవనంలోని కింది అంతస్తులో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నారు. కింది అంతస్తు నుంచి భవనం మొత్తానికి మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారు. సకాలంలో ఫైర్ ఇంజన్లు రాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.

అప్పటికే స్థానికులు ఇంటి గోడలు పగలగొట్టి స్పృహ కోల్పోయిన బాధితులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రమాదంలో మృతి చెందిన ఢిల్లీ బాబు పుట్టినరోజు నాడే తండ్రి స్నేహితుడు కలిసి మృత్యువాత పడినట్లు స్థానికులు తెలిపారు.
అగ్ని ప్రమాదంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పరిశ్రమ యజమాని భాస్కర్ కుమారుడు దిల్లీ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. జన్మదినం రోజే అతను మృతి చెందడంతో బంధువులు తీవ్ర విషాదంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications