వైసీపీకి ఎన్ని సీట్లొస్తాయో తేల్చేసిన మంత్రి రోజా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఫలితాలపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం లంబసింగి పర్యటనకు వెళ్తూ అనకాపల్లి జిల్లాలోని రాయల్ పార్క్ రిసార్ట్స్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి రోజా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు వైసీపీనే గెలుచుకుంటుందన్నారు.

వైసీపీకి 175 సీట్లు వస్తాయన్న రోజా
ప్రకృతి అందాలు దెబ్బతినకుండా ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు పర్యాటక శాఖ మంత్రి రోజా. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత పర్యాటక రంగం మరింత పుంజుకుందని, టెంపుల్ టూరిజంలో దేశంలోనే ఏపీ మూడోస్థానంలో ఉందని ఆమె వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ మాట మార్చిందంటూ రోజా ఫైర్
వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని గతంలో టీడీపీ చెప్పిందన్న రోజా.. ఆ తర్వాత టీడీపీ మాటమార్చిందన్నారు. సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తామని ఇప్పుడు టీడీపీ నేతలు చెబుతున్నారని, రోజుకోమాట మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.

సీఎం జగన్ వల్లే ఏపీ బాగుపడిందన్న రోజా
సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలతో ఏపీ బాగుపడిందని, అభివృద్ధి చెందిందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకునేలా మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని రోజా చెప్పారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాంతాల్లో మరిన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్వదేశీ దర్శన్, ప్రసాద పథకాలలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు నాలుగు ప్రాజెక్టులు మంజూరయ్యాని రోజా వెల్లడించారు. కాగా, ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇప్పటికే వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్లాలని పార్టీ నేతలకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు గట్టిగా హెచ్చరికలు కూడా చేశారు. ప్రజల మన్ననలు పొందకపోతే టికెట్ కష్టమనే సంకేతాలిచ్చారు.












Click it and Unblock the Notifications