వందే భారత్ రైలా.. మజాకా?
రాజమహేంద్రవరం: ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉంటూ వస్తోన్న అంశం- వందే భారత్ ఎక్స్ ప్రెస్. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే ఈ ఎక్స్ ప్రెస్ రోజూ వార్తల్లో నిలుస్తోంది. మిగిలిన రైళ్లతో పోల్చుకుంటే గరిష్ఠంగా మూడింతల వేగంతో- తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెడుతోండటంతో ప్రజలు- దీనిపై అత్యంత ఆసక్తిని చూపుతున్నారు.
ఒక్క రోజులో..
వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తుంది. గరిష్ఠంగా ఎనిమిదిన్నర గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ విశాఖపట్నంలో ఉదయం 5.45 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది.
పరిమితంగా హాల్ట్..
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి రాత్రి 11.30 నిమిషాలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించారు. రైలు ఇంటీరియర్ అద్దిరిపోతోంది. ఎరుపు, నీలం మిశ్రమంతో కుర్చీలను అమర్చారు అధికారులు. కిటికీ అద్దాలు విశాలంగా ఉంటాయి. ఇందులో స్లీపర్ సౌకర్యం ఉండదు. సీటింగ్ మాత్రమే అందుబాటులో ఉంది.
ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్..
ప్రయాణికుల సౌకర్యం కోసం సీటు ఎదురుగా ఓ టేబుల్, వాటర్ బాటిల్ హ్యాండల్ అమర్చారు. ర్యాక్ ఇన్ఫర్మేషన్ పొందు పరిచారు. ఒక్కో ర్యాక్ లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనేది ఈ ఛార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రైలుకు ఉన్నవన్నీ ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్. వాటంతటవే తెరచుకుంటాయి. నిర్దేశిత సమయం పూర్తి కాగానే మళ్లీ మూసుకుంటాయి. ప్రస్తుతం ఈ తరహా వ్యవస్థ మెట్రో రైలులో మాత్రమే అందుబాటులో ఉంది. డోర్ మూసుకోకపోతే అక్కడే ఉన్న గ్రీన్ బటన్ ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రయాణికులకు.
సెల్ఫీ కోసం..
ఈ రైలు తమ ఊరి మీదుగా రాకపోకలు సాగిస్తోండటంతో స్థానికులు సెల్ఫీలు, వీడియోలను తీసుకోవడానికి ఎగబడుతోన్నారు. తొలి రెండు రోజుల పాటు రైల్వే స్టేషన్లల్లో వారి రద్దీ అధికంగా కనిపించింది. ఇదివరకెప్పుడూ లేని సంఖ్యలో ప్లాట్ ఫామ్ టికెట్స్ అమ్ముడుపోవడమే దీనికి నిదర్శనం.
ఆ సెల్ఫీ మోజులో పడి..
ఆ సెల్ఫీ మోజులో పడి ఓ వ్యక్తి ఇబ్బందులను కొని తెచ్చుకున్నారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుందీ ఘటన. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరిన ఎక్స్ ప్రెస్ మార్గమధ్యలో రాజమండ్రి స్టేషన్ లో ఆగింది. అక్కడ రెండు నిమిషాల పాటు హాల్ట్ సౌకర్యం ఉందీ రైలుకు. ఆలోగా రైలు లోపలి భాగంలో ఫొటోలను తీసుకోవడానికి ప్రయత్నించాడో వ్యక్తి. లోనికి వెళ్లిన వెంటనే ఆటోమేటిక్ డోర్స్ మూసుకుపోయాయి.
విజయవాడ వరకూ..
డోర్స్ ను తెరవడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. సాధారణ రైళ్లల్లో డోర్స్ ను తెరవడం, మూయడం చేయవచ్చు. రైలు వేగం పుంజుకునే లోపే ప్లాట్ ఫామ్ పై దిగొచ్చు. వందే భారత్ దీనికి భిన్నం. రైలు కదలడానికి ముందే డోర్స్ క్లోజ్ అవుతాయి. మళ్లీ తరువాతి స్టేషన్ వచ్చేంత వరకూ వాటిని తెరవలేరు. అత్యవసర సమయంలో ర్యాక్ తలుపులు తెరచుకోవడానికి రెడ్ బటన్ ను అందుబాటులో ఉంచారు.
ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ కు సమాచారం..
సెల్ఫీ కోసం టికెట్ లేకుండా ఓ వ్యక్తి రైలు ఎక్కడనే విషయం తెలుసుకున్న టీటీఈ.. అతణ్ని మందలించాడు. ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ కు సమాచారం ఇచ్చాడు. మధ్యలో రైలు ఆపే ప్రసక్తే లేకపోవడంతో అతను విజయవాడ వరకూ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. టికెట్ లెస్ ట్రావెలింగ్ కింద ఆ వ్యక్తిపై టీటీఈ జరిమానా విధించారు. ఎంత మొత్తాన్ని ఫైన్ గా వసూలు చేశారనేది తెలియరాలేదు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.