తూర్పు గోదావరిలో పెను విషాదం: వశిష్ఠలో నలుగురు పదో తరగతి విద్యార్థులు గల్లంతు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదకర ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతోన్న నలుగురు విద్యార్థులు గోదావరిలో గల్లంతయ్యారు. గోదావరిలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఆ నలుగురూ ఇక మళ్లీ వెనక్కి రాలేదు. నది ఒడ్డున వారికి సంబంధించిన దుస్తులు, చెప్పులు, కొన్ని వస్తువులు మాత్రమే లభించాయి. సమాచారం అందుకున్న వెంటనే ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. 15 నుంచి 16 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారే.
గల్లంతైన వారిని ఖండవిల్లి వినయ్, సంతాల పవన్, యర్రంశెట్టి రత్నసాగర్, బండారు నవీన్ కుమార్గా గుర్తించారు. జిల్లాలోని పీ గన్నవరం మండలం పరిధిలోని లంకల గన్నవరం తీరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమీప గ్రామానికి చెందిన ఈ నలుగురు పదో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో వారంతా సరదాగా ఈత కొట్టడానికి వశిష్ఠ గోదావరికి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం వెళ్లిన ఆ నలుగురు సాయంత్రం వరకూ తిరిగి రాలేదు.
దీనితో వారి కుటుంబ సభ్యులు తీర ప్రాంతం పొడవునా గాలించారు. తమకు తెలిసిన వారికి ఫోన్ చేసి, ఆరా తీశారు. అయినప్పటికీ- వారి ఆచూకీ తెలియరాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలను చేపట్టారు.
నదీతీరంలో వారి దుస్తులు, చెప్పులు, సెల్ఫోన్లు, ఇతర వస్తువులు లభించాయి. స్నానం చేయడానికంటూ నదిలో దిగి గల్లంతై ఉంటారని అనుమానిస్తున్నారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకు గాలించినప్పటికీ.. ఫలితం రాలేదు. వారి ఆచూకీ తెలియరాలేదు.