విషాదం : బీటెక్ విద్యార్థి ఆత్మహత్య... కన్నీటిపర్యంతమవతూ సెల్ఫీ వీడియో.. కారణమిదే..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన అతను.. పరీక్షలో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతోనే ఈ చర్యకు ఒడిగట్టినట్లు చెప్పాడు.
Recommended Video

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతుల కుమారుడు తిరుమలేష్(23) ప్రస్తుతం ఏలూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో తల్లిదండ్రులు అతన్ని అల్లారుముద్దుగా పెంచారు. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఇటీవల పరీక్ష రాసిన తిరమలేష్ అందులో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తిరుమలేష్ తనలో తానే తీవ్రంగా కుమిలిపోయాడు.

ఉన్నత చదువులు చదవాలన్న తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేకపోతున్నానన్న బాధతో బుధవారం(జనవరి 6) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. తాను ఫెయిల్యూర్గా మిగిలిపోయానని... ఎంత చదివినా ముందుకు సాగలేకపోతున్నానని ఆ వీడియోలో వాపోయాడు. తనలాంటి ఎదవకు జన్మనిచ్చి తప్పు చేశారమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక సెలవమ్మా.. నన్ను క్షమించండి అంటూ జీవితానికి ముగింపు పలికాడు. ఆ వీడియో రికార్డ్ చేస్తున్నంతసేపు కన్నీటిపర్యంతమయ్యాడు.
ఆ వీడియోను వాట్సాప్లో మిత్రులకు షేర్ చేసి తిరుమలేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి నేత్రాలను ఆ తల్లిదండ్రులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications