2024, 2029లో ఆ నియోజకవర్గంపై ఎగిరేది వైసీపీ జెండానే..!!
ఏలూరు: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో దెందులూరు ఒకటి. ఏలూరు జిల్లాలో ఉండే ఈ స్థానంపై టీడీపీ గట్టి పట్టు ఉండేది. 2009, 2014లో ఆ పార్టీ అభ్యర్థే ఇక్కడి నుంచి గెలుపొందారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది దెందులూరు నియోజకవర్గం పరిధిలో. అందుకే ఆ సామాజిక వర్గ అభ్యర్థులే ఇక్కడ వరుస విజయాలను సాధిస్తూ వస్తోన్నారు.
టీడీపీకి గట్టిపట్టు..
2004లో కాంగ్రెస్ ఇక్కడ జెండా ఎగురవేసింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి బాబు ఘన విజయం సాధించారు. 2009 నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ విజయదుందుభి మోగించారు. రెండోసారి కూడా అంటే 2014లోనూ దెందులూరు నుంచి ఆయనే విజయం సాధించారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి తలకిందులైంది. టీడీపీ జైత్రయాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గండి కొట్టింది.
చింతమనేని హ్యాట్రిక్ ఆశలపై..
సుమారు 16,000పైగా ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి కొఠారి అబ్బయ్య చౌదరి గెలుపొందారు. చింతమనేని ప్రభాకర్ను ఓడించారు. హ్యాట్రిక్ సాధించాలనుకున్న చింతమనేని ఆశలపై కొఠారి నీళ్లు చల్లారు. 2024 ఎన్నికల నాటికి ఇక్కడి పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం మీద కొఠారి అబ్బయ్య చౌదరి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఎగిరేది వైసీపీ జెండానే..
ఈ నియోజకవర్గంపై తాము జెండా పాతేశామని, ప్రతి ఎన్నికలోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2024 గానీ, 2029 గానీ దెందులూరు నియోజకవర్గంపై ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా మాత్రమేనని తేల్చి చెప్పారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తోన్న మంచి పనులే ఇక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తాయని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో వైఎస్ జగన్ సైనికుడిగా తానే ఎమ్మెల్యేగా ఎన్నికవుతానని పేర్కొన్నారు.
వెనుకబడటానికి కారకుడు ఆయనే..
దెందులూరు నియోజకవర్గం అన్ని విధాలుగా వెనుకబడటానికి చింతమనేని ప్రభాకరే ప్రధాన కారకుడని కొఠారి అబ్బయ్య చౌదరి విమర్శించారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని తన సొంత నియోజకవర్గాన్ని ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. చింతమనేని సొంత ఊరు దుగ్గిరాల కూడా అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై తాను ఎక్కడికైనా చర్చకు వస్తానని సవాల్ విసిరారు. దుగ్గిరాలలనైనా చర్చకు సిద్ధమేనని చెప్పారు.
వివాదాస్పద స్థానంగా..
చింతమనేని ప్రభాకర్ హయాంలో దెందులూరు- ఓ వివాదాస్పద నియోజకవర్గంగా మాత్రమే గుర్తింపు పొందిందని కొఠారి అబ్బయ్య చౌదరి వ్యాఖ్యానించారు. అధికారులను కొట్టిన నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్రవ్యాప్తంగా చింతమనేని ప్రభాకర్ గుర్తింపు తెచ్చుకున్నాడే తప్ప- ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసిన నాయకుడిగా ఆయనకు ఏనాడ పేరు రాలేదని విమర్శించారు. దెందులూరు అనగానే ఓ నెగెటివ్ ప్రచారం ఒక్కటే వినిపిస్తుంటుందని చెప్పారు.
ఏ కోశానా లేని వ్యక్తి..
ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన చింతమనేనికి ఏ కోశానా లేదని, అందుకే వెనుకబడిందని అబ్బయ్య చౌదరి చెప్పారు. ప్రజల అభిప్రాయాలు గానీ, వారి ఆలోచనలు గానీ ఏ మాత్రం తెలియని వ్యక్తిగా చింతమనేనిని అభివర్ణించారు. 2019లో మాత్రమే కాదు.. 2024లో అయినా, 2029లో అయినా దెందులూరులో ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమేనని అబ్బయ్య చౌదరి తేల్చి చెప్పారు.