నేడే అక్షయ తృతీయ: ఈ వస్తువులు కొన్నా బంగారం కొన్నంత శుభాలు
నేడే అక్షయ తృతీయ. హిందూ సంప్రదాయంలో వైశాఖ మాసంలోని తొలి ప్రధాన పండుగను అక్షయ తృతీయగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. శుక్ల పక్షంలో మూడవ రోజున ఈ మహోన్నత పర్వదినాన్ని జరుపుకొంటారు. విశ్వ రక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు ఈ పవిత్ర దినాన జన్మించాడని ప్రతీతి. అందుకే ఈ రోజును చాలా రాష్ట్రాల్లో పరశురామ జయంతిగా కూడా జరుపుకొంటారు.
స్వర్గం నుండి గంగా నది భూమిపైకి అవతరించిన పవిత్ర దినంగా కూడా దీన్ని భావిస్తారు. మహాభారతంలో పాండవులు అక్షయ పాత్రను పొందింది కూడా ఇదే తిథి నాడే. అది అపరిమితమైన ఆహారాన్ని అందించి, సమృద్ధికి, ఆశీర్వాదాలకు ప్రతీకగా నిలిచింది. అక్షయ తృతీయ- భాగ్యం, ఐశ్వర్యాన్ని వృద్ధి చేసే అనేక శుభకార్యాలకు ప్రసిద్ధి. ఈ శుభ దినాన దానధర్మాలు చేయడం, మంత్రాలను జపించడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.

ఈ రోజు ఏ సమయంలోనైనా శుభ కార్యాలను నిర్వర్తించవచ్చు. ప్రత్యేకంగా ఎటువంటి ముహూర్తం చూడాల్సిన అవసరం ఉండదు. ఈ పర్వదినం రోజు బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేయడం వల్ల విశేష పుణ్య ఫలాలు లభిస్తాయని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున తెల్లవారుజాముననే నిద్రలేచి స్నానం చేయడం శుభకరం. సాధ్యమైతే, గంగా జలంతో స్నానం చేయడం వల్ల పుణ్యం. వీలులేకపోతే ఇంటి వద్ద స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకోవచ్చు.
పవిత్ర జలాలతో స్నానం చేసిన తర్వాత, విష్ణువు, లక్ష్మీదేవిలను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఇంట్లో లక్ష్మీ నారాయణుల విగ్రహాలను లేదా చిత్రపటాలను ప్రతిష్టించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. ఈ రోజు సత్తు పిండి, దోసకాయ, శనగపప్పు, పువ్వులు, పండ్లు, తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే, అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. దానం చేయడాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. లేనివారికి ఆహారం, నీరు, దుస్తులు, డబ్బు వంటి వాటిని దానం చేయడం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది.
అక్షయ తృతీయ నాడు ఎలాంటి శుభకార్యం ప్రారంభించడానికైనా ప్రత్యేక సమయం లేదా ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం పవిత్రమైనదని నమ్ముతారు. బంగారం, వెండితో పాటు భూమి, ఇతర విలువైన స్థిరాస్తుల కొనుగోలు కూడా ఈ రోజు శుభప్రదం. అంతేకాదు, ఇత్తడి, కంచు లోహాల పాత్రలు లేదా ఆ లోహాలతో చేసిన వస్తువులను కొనుగోలు చేయడం కూడా అదృష్టకరమని భావిస్తారు.
అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి ఫర్నిచర్, కొత్త వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు వంటి వాటిని తీసుకురావడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. అక్షయ తృతీయ రోజున పైన పేర్కొన్న పనులను ఆచరించడం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున చేసే ఏ శుభ కార్యమైనా ఇటు ఐశ్వర్యాన్ని, అటు అదృష్టాన్ని అందిస్తుందని నమ్ముతారు. అన్ని పనులు చేయాలని నియమేం లేదు, మీ శక్తి మేరకు పనులు చేయవచ్చు.












Click it and Unblock the Notifications