health tips: వాటర్ కు డయాబెటిస్ కు లింక్.. అదేంటో తెలుసా!!
ఎంతో ఆరోగ్యకరమైన డైట్ తీసుకున్నా, ఎన్నో జాగ్రత్తలు పాటించినా షుగర్ లెవెల్స్ పెరిగాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే డయాబెటిస్ కు నీటికి లింకు ఉందన్న అసలు విషయాన్ని గుర్తుంచుకోరు. అవును.. నీటికి డయాబెటిస్ కు మధ్య లింక్ ఉందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఎవరైతే నీటిని ఎక్కువగా తాగడం మరిచిపోతారో వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

డయాబెటిస్ రోగులకు నీరు మేలు చేసే పానీయం
చాలామంది నిజ జీవితంలో నీటికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అయితే నీరు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక భూమిక పోషిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఎప్పుడూ శరీరం డీహైడ్రేట్ కాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడడంలో నీరు కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఉండవు కాబట్టి మధుమేహం ఉన్న వారికి నీరు మంచి పానీయం అని చెబుతున్నారు. అందుకే ఎటువంటి పరిస్థితులలోనూ నీరు తాగడం మరిచిపోకూడదు అని సూచిస్తున్నారు.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటంలో నీటిదే ప్రధాన పాత్ర
రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, మధుమేహం ఉన్న వారి శరీరాలకు ఎక్కువ ద్రవపదార్ధాలు అవసరమవుతాయి. అలాంటి సమయంలో నీటిని ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో అదనంగా ఉన్న చక్కెర మూత్రం ద్వారా బయటకు విసర్జించబడుతుంది. కాబట్టి మధుమేహ బాధితులు నీటిని తాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల అది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా సహాయపడుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారు రక్తంలో అధికంగా ఉన్న చక్కెరను నియంత్రించడం కోసం నీరు త్రాగడం ప్రధానంగా సూచించబడింది.

డయాబెటిస్ బాధితులకు ఈ సమస్య.. అందుకే బీ కేర్ ఫుల్
కొంతమంది డయాబెటిస్ బాధితులు ఎక్కువగా మూత్ర విసర్జన సమస్యలు కలిగి ఉంటారు. ఎక్కువగా మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు శరీరంలో నీరు తగ్గిపోయి శరీరం డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అలా శరీరం ఎక్కువ డీహైడ్రేట్ అయితే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయి. కాబట్టి నీరు తీసుకునే విషయంలో మధుమేహ బాధితులు జాగ్రత్తగా ఉండాలి.

డయాబెటిస్ కే కాదు అనేక రోగాలకు నీటితో చెక్
ప్రతిరోజు మనం నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని శరీరానికి సరిపడినంతగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ నుంచి మాత్రమే కాకుండా, అనేక ఇతర ఆరోగ్య సమస్యల నుండి కూడా శరీరాన్ని కాపాడిన వారవుతారు అని చెబుతున్నారు. మొత్తానికి డయాబెటిస్ కి మనం తాగే నీటికి లింకు ఉందన్న విషయాన్ని గుర్తించి డయాబెటిస్ బాధితులు ఇప్పటికైనా శరీరానికి సరిపడా నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications