Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కక్కా, ముక్కా కాదు కదా దాని వాసన కూడా సోకని నగరాలు: కోడిగుడ్లపైనా పర్మినెంట్ బ్యాన్

దేశంలో ఏ మూలకు వెళ్లినా మాంసాహరం లభిస్తుంది. చికెన్, మటన్, చేపలకు కొదవ ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో చేపలు ప్రధాన ఆహారం కూడా. అవి లేనిదే ముద్ద కూడా దిగని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో మరి కొన్ని నగరాల్లో మాంసాహారంపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. వాటిని తినడం, విక్రయించడంపైనా సంపూర్ణ నిషేధం అమలులో ఉంది. ఆయా నగరాల పవిత్రతను కాపాడటానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వీటిని అమలు చేస్తోన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రిషికేశ్, ఉత్తరాఖండ్‌:

మహా శివుడు కొలువుదీరిన ప్రదేశం. హిందువులకు అత్యంత పవిత్రమైన నగరాలలో ఒకటి. ఇక్కడ ప్రతిరోజూ జరిగే గంగా హారతిని తిలకించడానికి దేశం నలుమూలలతో పాటు విదేశాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ పవిత్ర స్థలంలో మాంసాహారం పూర్తిగా నిషేధం. ఇక్కడి రెస్టారెంట్లలో పూర్తిగా శాఖాహార వంటకాలు మాత్రమే లభిస్తాయి. ఇక్కడ అనేక దేవాలయాలు, ఆశ్రమాలు ఉన్నాయి.

వారణాసి, ఉత్తరప్రదేశ్‌:

వారణాసి.. అత్యంత ప్రాచీన నగరం. పరమ శివుడి నివాసంగా భావిస్తారు. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి అనేక దేశాల నుండి భక్తులు వస్తారు. ఇక్కడి కాశీ విశ్వనాథ దేవాలయం దేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి. ఇది- 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. వారణాసిలోని ఆలయాలు, వారసత్వ ప్రదేశాల చుట్టూ మద్యం, మాంసం విక్రయాలు పూర్తిగా నిషేధం.

హరిద్వార్, ఉత్తరాఖండ్‌:

మాంసాహారం సంపూర్ణంగా నిషేధం ఉన్న నగరాల్లో ఇదీ ఒకటి. హరిద్వార్ ను దేవతల ముఖ ద్వారంగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు గంగానదిలో స్నానం చేయడానికి ఇక్కడికి వస్తారు. కన్వర్ యాత్ర సమయంలో భారీ సంఖ్యలో భక్తులు హరిద్వార్‌కు తరలివస్తారు. అందుకే ఇక్కడ మాంసాహార వినియోగం, విక్రయం పూర్తిగా నిషేధం.

బృందావనం, ఉత్తరప్రదేశ్‌:

శ్రీకృష్ణుడు నడయాడిన ప్రాంతం ఇది. ఈ గడ్డపై అనేక పవిత్ర స్థలాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఇక్కడే గడిపాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణుడి భక్తులు బృందావనాన్ని సందర్శిస్తారు. ఇక్కడ ఆయనకు అంకితం చేసిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ కారణంతో ఈ పవిత్ర స్థలంలో మాంసాహారం పూర్తిగా నిషేధం.

అయోధ్య, ఉత్తరప్రదేశ్‌:

శ్రీరాముడి జన్మస్థలం. ఇది దేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడి బాల రాముడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు. ఈ కారణంతో, ఈ నగరంలో మాంసాహారం అనుమతించరు.

భావ్‌నగర్, గుజరాత్‌:

ఈ జిల్లాలోని పాలిటానాలో మాంసాహార వినియోగం, విక్రయం పూర్తిగా నిషేధించారు. వాస్తవానికి- ఇది ప్రపంచంలోనే మొదటి పూర్తిగా శాకాహార నగరంగా పేరుగాంచింది. ఇక్కడ మాంసం దుకాణాలు కూడా ఉండవు. ఇది ప్రపంచంలోని ముఖ్యమైన జైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. జైనుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎవరూ గుడ్లు లేదా మాంసాన్ని విక్రయించలేరు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+