చిచ్చు పెట్టిన ఫించను.. భార్యను హత్య చేసిన వృద్దుడు... తల్లి మృతదేహాన్ని చూసి షాక్ తిన్న కొడుకు...
ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ వృద్ద దంపతుల మధ్య వృద్దాప్య ఫించను చిచ్చు పెట్టింది. అది కాస్త ముదిరి ఏకంగా వృద్దురాలి ప్రాణాలను బలితీసుకున్నది. ఫించనులో తనకు రావాల్సిన వాటాను ఇవ్వట్లేదన్న కారణంతో వృద్దురాలి భర్తే ఆమెను హత్య చేశాడు. తాను హత్య చేశానని చెప్తే మొదట ఆ వృద్దుడిని ఎవరూ నమ్మలేదు. కానీ అసలు విషయం తెలిశాక షాక్ తిన్నారు. గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది.

అసలేం జరిగింది...
చుండూరు ఇన్స్పెక్టర్ బి.రమేశ్ బాబు కథనం ప్రకారం... గుంటూరు జిల్లా యలవర్రు గ్రామానికి చెందిన సామియేలు-ఎప్రాయమ్మ వృద్ద దంపతులకు ముగ్గురు కొడుకులు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లవడంతో వేర్వేరు చోట్లు స్థిరపడ్డారు. వృద్ద దంపతుల మధ్య పదేళ్ల క్రితం విభేదాలు తలెత్తడంతో... అప్పటినుంచి వేర్వేరుగా ఉంటున్నారు. అయితే అధికారికంగా విడాకులు మాత్రం తీసుకోలేదు. ఏపీ ప్రభుత్వం.. ఇంట్లో ఒకరికి వృద్దాప్య ఫించను రూ.2250 ఇస్తుండటంతో ఎప్రాయమ్మ అందుకోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆమెకు ప్రభుత్వ ఫించను అందుతోంది.

ఖర్చులకు రూ.200 ఇవ్వాలన్న సామియేలు...
ఇంట్లో ఒకరికే వృద్దాప్య ఫించను ఇస్తుండటంతో... ఒకే ఫించను డబ్బులను వృద్ద దంపతులు పంచుకుంటున్నారు. అలా ప్రతీ నెలా ఫించను డబ్బులు అందగానే... అందులో కొంత మొత్తాన్ని ఎప్రాయమ్మ సామియేలుకు ఇస్తోంది. ఇదే క్రమంలో ఆదివారం(నవంబర్ 1) రాత్రి సామియేలు భార్య ఎప్రాయమ్మ ఇంటికెళ్లాడు. ఖర్చుల కోసం ఫించను డబ్బుల్లో నుంచి రూ.200 ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అర్ధరాత్రి వరకూ ఇద్దరు గొడవపడ్డారు. ఆ తర్వాత సామియేలు తన ఇంటికి వెళ్లిపోయాడు.

మళ్లీ గొడవ... ఈసారి హత్య...
సోమవారం(నవంబర్ 2) తెల్లవారుజామునే సామియేలు మళ్లీ ఎప్రాయమ్మ ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర కోపోద్రిక్తుడైన సామియేలు తన చేతికర్రతో ఎప్రాయమ్మపై బలంగా దాడి చేశాడు. దీంతో ఎప్రాయమ్మ కుప్పకూలింది. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత సామియేలు తన పెద్ద కొడుకు ఏసయ్య ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఆ విషయాన్ని అతను నమ్మలేదు. తండ్రి మాటలను పట్టించుకోకుండా పనికి వెళ్లిపోయాడు.

షాక్ తిన్న కొడుకు...
ఇంతలో ఎప్రాయమ్మ ఇంటి చుట్టుపక్కలవాళ్లు.. ఆమె రక్తపు మడుగులో పడి ఉండటం గమనించారు. వెంటనే పెద్ద కొడుకుకి సమాచారం అందించారు. దీంతో తల్లి ఇంటికి చేరుకున్న ఏసయ్య ఆమె మృతదేహాన్ని చూసి షాక్ తిన్నాడు. తండ్రి చెప్పింది నిజమేనని అనుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... ఇన్స్పెక్టర్ రమేశ్ బాబు అక్కడికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సామియేలుపై హత్య కేసు నమోదు చేశారు. ఎప్రాయమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్త కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications