అయేషా మీరా హత్య కేసు: సీజేఐకి ఆమె తల్లి లేఖ, జోక్యం చేసుకోవాలని వేడుకోలు
తెలుగు రాష్ట్రాల పర్యటనలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. బిజీగా గడిపారు. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయేషా మీరా హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేసు విచారణ.. సీబీఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దీంతో ఆమె తల్లి శంషాద్ బేగం కడుపు కోత అలానే ఉంది. దీంతో ఆమె సీజేఐకి లేఖ రాశారు.
సీబీఐ కూడా
తన కూతురి హత్య విషయంలో సీబీఐ కూడా న్యాయం చేయడం లేదని శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆమె మీడియాతో మాట్లాడారు. అయేషా మీరా హత్యకేసులో సిట్ వైఫల్యం చెందడంతో సీబీఐకి అప్పగించాలని కోర్టును ఆశ్రయించామన్నారు. సీబీఐ కేసు తీసుకుని రెండేళ్లు అవుతున్నా ఎలాంటి పురోగతి కనిపించలేదని తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసే ప్రయత్నం చేసినా వీలు కాలేదని చెప్పారు. జోక్యం చేసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ లేఖను సీజేఐ మెయిల్కు పంపానని తెలిపారు. తొలుత సమాధిని తెరవడానికి తాము, మత పెద్దలు ఒప్పుకోకపోవడంతో హైకోర్టుకు కూడా వెళ్లి ఆర్డర్ తెచ్చి మత పెద్దలను ఒప్పించి అవయవ భాగాలు సేకరించి ఏం సాధించలేకపోయారని వివరించారు. కేసును సమగ్రంగా విచారించి తగిన న్యాయం చేసేలా సీజేఐ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నట్లు శంషాద్ బేగం చెప్పారు.
నిర్దోషిగా..
ఆయేషా మీరా హత్య కేసులో అరెస్టయిన ప్రధాన అనుమానితుడు సత్యం బాబు సైతం నిర్దోషిగా బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసు సీబీఐకి అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసం కావడంతో.. తిరిగి వాటిని సేకరించడం సీబీఐకి సవాల్గా మారింది. దీంతో రీ-పోస్ట్మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. దీనికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఆయేషా మీరా హత్య మరోసారి చర్చనీయంగా మారింది. 2007, డిసెంబరు 7, విజయవాడలోని దుర్గా లేడీస్ హాస్టల్లో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. హాస్టల్లోని రెండో అంతస్తులో గల కిచెన్లో నిద్రపోయిన ఓ యువతికి ఉదయం 5.30 గంటలకు మెలకువ వచ్చింది. టాయిలెట్లోకి వెళ్లేందుకు హాల్లోకి వచ్చింది. హాల్లో వస్తువులన్నీ చిందరవందరగా పడివున్నాయి. హాల్లో బెడ్ మీద పడుకున్న ఆయేషా మీరా కూడా కనిపించలేదు. నేలపై రక్తం మరకలు కనిపించడంతో కంగారుపడిన ఆ యువతి వెంటనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాస్టల్ వార్డెన్కు ఫోన్ చేసింది. దీంతో ఆమె వెంటనే రెండో అంతస్తులోకి వచ్చింది. ఆ రక్తపు మరకలు బాత్రూమ్ వరకు ఉన్నాయి.
8 నెలలు గడిచినా..
బాత్రూమ్లో రక్తపు మడుగులో దయనీయ స్థితిలో పడివున్న ఆయేషాను చూసి హాస్టల్ సిబ్బంది హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయేషా విజయవాడలోని నిమ్రా కాలేజ్లో ఫస్టియర్ బీఫార్మసీ చదివేది. ఆమె హత్య తర్వాత హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలను, వార్డెన్ను, స్నేహితులను కూడా పోలీసులు విచారించారు. ఘటనా స్థలంలో ఫుట్ ప్రింట్స్, శరీరం మీద వీర్యం, లేఖను స్వాధీనం చేసుకున్నారు. వీర్యం ఆధారంగా డీఎన్ఏ ప్రొఫైల్ను సిద్ధం చేశారు. సుమారు 56 మంది అనుమానితులను విచారించారు. డీఎన్ఏ ప్రొఫైల్ ఎవరికీ మ్యాచ్ కాకపోవడంతో వారిని వదిలిపెట్టారు. చివరికి ఓ అత్యాచారం కేసులో అరెస్టయిన గురివిందర్ సింగ్ అనే వ్యక్తిని సైతం విచారించారు. అతడి ఫింగర్ ప్రింట్లు, డీఎన్ఏ కూడా మ్యాచ్ కాకపోవడంతో వదిలిపెట్టేశారు. 8 నెలలు గడిచినా నిందితుడు ఎవరనేది తెలియరాలేదు. దీంతో పోలీసులపై ఒత్తిడి బాగా పెరిగింది.
గత నేరచరిత్ర
సత్యంబాబును అరెస్టు చేసిన పోలీసులు గతంలో ఫిర్యాదులు అందిన హాస్టళ్ల వద్దకు తీసుకెళ్లారు. సత్యం బాబును అక్కడి అమ్మాయిలకు చూపించి.. హాస్టళ్లలోకి చొరబడిన వ్యక్తి ఇతనేనా అని ప్రశ్నించారు. అమ్మాయిలు ఔనని చెప్పడంతో సత్యం బాబే ఆయేషాను హత్య చేసి ఉంటాడనే అనుమానాలు పోలీసుల్లో బలపడ్డాయి. దీంతో ఈ కేసులో అప్రూవర్గా మారితే నీకు ఎటువంటి శిక్ష పడకుండా చూస్తామని పోలీసులు అతడికి హామీ ఇచ్చారు. సత్యం ఒక్కో కేసు గురించి వివరిస్తూ.. ఆయేషా హత్య ఘటనపై నోరు విప్పాడు. పోలీసులు అదంతా వీడియో రికార్డు చేసి సత్యం బాబును కోర్టుకు అప్పగించారు.
అనుమానాలు..
ఆయేషా తల్లి చేసిన ఆరోపణలు మరిన్ని అనుమానాలకు దారితీసింది. పోలీసులు చెబుతున్నదంతా కట్టుకథలా ఉందని, వారి మాటలపై నమ్మకం లేక తాను స్వయంగా విచారణ జరిపితే అసలు విషయం తెలిసిందని ఆమె తెలిపారు. ఆయేషా ఉంటున్న హాస్టల్ మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ బినామీది అని పేర్కొన్నారు. ఆ హాస్టల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండేవని, వాటితో సతీష్, అతని స్నేహితులకు సంబంధం ఉందన్నారు. హత్య జరిగిన రోజు గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ జరిగిందని, ఆ రోజు ఆయేషా 9 గంటలకే నిద్రపోయిందని తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో పార్టీకి హాజరైన వ్యక్తులు హాస్టల్ తలుపులు కొట్టారని, దీంతో ఆయేషా వారిపై ఫిర్యాదు చేస్తానని తెలిపిందని పేర్కొన్నారు. దీంతో ఆమె తలను కిటికీ డోరుకు కొట్టి, తలగడతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని ఆరోపించారు. ఉదయం ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు ఆయేశా మృతదేహాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు చూడనివ్వలేదని తెలిపారు. నిందితుడు మంత్రి బంధువు కావడం వల్ల తప్పుడు ఆధారాలు సృష్టించారని ఆమె ఆరోపించారు.
హైకోర్టులో సవాల్
సత్యం బాబు తల్లి సత్యం బాబు వాళ్ల అమ్మ తన కొడుకుకు విధించిన శిక్షపై ఏపీ హైకోర్టులో సవాలు చేశారు. సత్యంబాబు కేసు వాధించిన లాయర్ విచారణలో అనుమానాలు వ్యక్తం చేశారు. సత్యంబాబును బెదిరించి అలా చెప్పించారని తెలిపారు. దీంతో సత్యం 2017లో జైలు నుంచి విడుదలయ్యాడు. తాము సేకరించిన ఆధారాలన్నీ నిజమైనవేనని పోలీసులు స్పష్టం చేశారు. ఆయేషా తల్లి కోనేరు సతీష్ హత్మ చేశాడని ఆరోపించారని, ఆయన ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నట్లు కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ టికెట్ చూపించారని తెలిపారు. ఎవరినైనా ఆధారాలు ఉంటేనే అరెస్టు చేయగలమని, హత్య చేసింది సత్యం బాబేనని, తాము సుప్రీం కోర్టు ఇది నిరూపిస్తామన్నారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.