జగన్ కొత్త కాన్సెప్ట్: మంత్రి విడదల రజినీ నియోజకవర్గంలో
పల్నాడు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి జిల్లా పర్యటనకు పూనుకున్నారు. పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇంటి వద్దకే వైద్య సేవలను అందించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఈ నెల 6వ తేదీన వైఎస్ జగన్ దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనితో ఫ్యామిలీ డాక్టర్ల సేవలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున ఖాళీలను కూడా భర్తీ చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో లేని చోట్ల కొత్త వారిని నియమించారు. రాష్ట్రంలోని అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్ లకు ఫ్యామిలీ డాక్టర్ల సేవలను అనుసంధానించారు. ఆసుపత్రుల నిర్మాణ పనులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న 104 వాహనల ద్వారా రాష్ట్రంలోని అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్ లకు మందులు, ఇతర వైద్య పరికరాలను సమకూర్చనున్నారు.

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద- విలేజ్ హెల్త్ క్లినిక్ లను ప్రభుత్వం ఇప్పటికే బలోపేతం చేసింది. మందులను అందుబాటులో తీసుకొచ్చింది. సిబ్బంది ఖాళీలను భర్తీ చేసింది. పరికరాల కొరత లేకుండా చర్యలు తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లలోని పిల్లలందరికీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. దీనికి అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు అధికారులు.
ఆయా పరీక్షల్లో పౌష్టికాహార లోపం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా తేలితే అప్పటికప్పుడే మెరుగైన చికిత్సను ఫ్యామిలీ డాక్టర్లు అందజేస్తారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు వారు రిఫర్ చేస్తారు. చిన్న పిల్లలు, గర్భిణిలకు కూడా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న చిలకలూరిపేట నియోజకవర్గంలో దీన్ని జగన్ ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications