పొత్తుల బేరాలు: ఆలపాటి రాజా ఇంటికి సుజన చౌదరి: మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
గుంటూరు: రాష్ట్రంలో రాజకీయాల సమీకరణాలు మారుతున్నట్టే కనిపిస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- పొత్తుల దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూకుడును అడ్డుకోవడానికి 2014 తరహాలో తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ-జనసేన, ఇతర పార్టీలన్నీ మహాకూటమిగా ఆవిర్భవించాలని భావిస్తోన్నాయి.
బీజేపీతో జట్టు కట్టడానికి తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నాలను సాగిస్తోంది. ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం అంటూ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. పొత్తుల విషయంలో బీజేపీ అధిష్ఠానం ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలను పంపించలేదు. అటు జనసేనతో ఉన్న పొత్తును ప్రస్తుతానికి కొనసాగిస్తోంది.

ఈ పరిణామాల మధ్య- బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు సుజన చౌదరి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లారు. ఈ సమావేశంలో టీడీపీ మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీ నారాయణతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో ఇటీవలే బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ కారుపై జరిగిన దాడిపై చర్చించారు.
సత్యకుమార్పై జరిగిన దాడి ఘటనపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి సహకరించాలని సుజనా చౌదరి టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ నాయకులే సత్యకుమార్పై దాడి చేశారని, దీన్ని ఉమ్మడిగా ఎదిరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తోన్న నిరసన దీక్షలకు బీజేపీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సుజనా చౌదరి స్పష్టం చేశారు.
బీజేపీ మద్దతును వైసీపీ సహించలేకపోతోందని, అందుకే తన గుండాలతో సత్యకుమార్పై దాడి చేయించిందని ఆరోపించారు సుజనా చౌదరి. ఆయన కాన్వాయ్పై రాళ్లతో దాడి చేయడం సిగ్గుచేటని, ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని, ఈ ఓటును చీలనివ్వకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications