కరోనా లక్షణాలతో క్వారంటైన్ కు గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే- 15 మంది కుటుంబ సభ్యులు కూడా..
గుంటూరులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమానికి వెళ్లి తిరిగొచ్చిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముుస్తఫా బావతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ గా తేలడంతో వీరిద్దరూ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. అదే సమయంలో బావ, కుటుంబ సభ్యులతో కలిసి ఇన్ని రోజులుగా ఉంటున్న ఎమ్మెల్యే ముస్తఫా కూడా కరోనా లక్షణాలతో గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి క్వారంటైన్ లో చేరడం కలకలం రేపుతోంది.

కొంపముంచిన బావ, టెన్షన్ లో ఎమ్మెల్యే..
వారం క్రితం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా బావ ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరై తిరిగి వచ్చారు. వచ్చాక నగరంలోని మంగళ్ దాస్ నగర్ లో 500 మందికి గ్రాండ్ గా విందు కూడా ఇచ్చారు. ఇందులో ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా దీనికి హాజరయ్యారు. వీరితో పాటు ముస్తఫా కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ముస్తఫా బావకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోవడం పాజిటివ్ గా నిర్ధారణ కావడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ముస్తపా సోదరికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వీరిద్దరూ క్వారంటైన్ లో ఉన్నారు.

విందులో పాల్గొన్న వారికి ముచ్చెమటలు..
ఎమ్మెల్యే ముస్తఫా బావ, సోదరికి కరోనా పాజిటివ్ గా తేలిన నేపథ్యంలో విందుకు హాజరైన వారందరికీ టెన్షన్ మొదలైంది. ఇందులో ముస్తఫాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వింధులో పాల్గొన్న వారిలో కొందరు ఇప్పటికే కరోనా లక్షణాలతో బాధపడుతుండగా.. మరికొందరి పరిస్ధితి ఏంటో ఇంకా తేలడం లేదు. దీంతో వీరందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. వీరితో పాటు విందులో పాల్గొన్న వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు క్వారంటైన్ కు పరుగులు తీసే పరిస్దితి ..

ఆస్పత్రికి ఎమ్మెల్యే ముస్తఫా, కుటుంబసభ్యులు..
బావ ఇచ్చిన విందులో పాల్గొన్న నేపథ్యంలో తమకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్లు భావించిన ముుస్తఫా కుటుంబ సభ్యులు కొందరిలో ఆందోళన పెరగడంతో రెండు రోజులుగా వేచి చూసిన ఎమ్మెల్యే.. ఇవాళ 15 మంది కుటుంబంతో కలిసి గుంటూరుకు సమీపంలోని కాటూరి ఆస్పత్రికి మూడు వాహనాలు, అంబులెన్స్ లో తరలి వెళ్లారు. వీరిని ప్రాధమిక పరీక్షల తర్వాత అవవసరాన్ని బట్టి క్వారంటైన్లో ఉంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. స్ధానికంగా ఉన్న అధికారులు మాత్రం విషయాన్ని నిర్ధారించారు.

మిగిలిన వారి కోసం అన్వేషణ..
ముస్తఫా బావ ఇచ్చిన విందులో పాల్గొన్న వారిలో కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ఆస్పత్రికి వెళ్లి క్వారంటైన్ కు సిద్ధపడిన తరుణంలో మిగిలిన వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. స్వచ్ఛందంగా బయటికి వస్తే తగిన సాయం అందిస్తామని చెప్తున్నారు. వీరిలో కొందరు విందు అయ్యాక తర్వాత రోజు మరికొన్ని చోట్ల పలువురిని కలిసినట్లు తేలడంతో ఇప్పుడు వారి పరిస్ధితి ఏమిటన్నది కూడా తేలడం లేదు. దీంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కరోనా లక్షణాలు కనిపిస్తే చాలు తమను సంప్రదించాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications