తన తండ్రి కోడెల మరణంపై శివరాం స్పందన ఇది
విజయవాడ: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణవార్త వినగానే ఆయన కుమారుడు శివరాం విదేశాల నుంచి స్వదేశానికి పయనమయ్యారు. కెన్యా నుంచి మంగళవారం ఉదయం ముంబై చేరుకున్న శివరామ్.. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం వచ్చారు.

ఇప్పుడేం మాట్లాడను..
తమ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని.. తాను ఈ పరిస్థితిలో ఏమీ మాట్లాడలేనని శివరామ్ వ్యాఖ్యానించారు. కాగా, హైదరాబాద్ నుంచి గుంటూరుకు కోడెల శివప్రసాదరావు పార్థీవదేహాన్ని తరలించారు. మార్గమధ్యలో కోడెల పార్థీవ దేహానికి స్థానిక టీడీపీ నేతలు నివాళుర్పించారు.

అభిమాన నేతకు కడసారి..
భారీ వర్షం పడుతున్నప్పటికీ నందిగామ వద్ద టీడీపీ నేతలు కోడెలకు నివాళులర్పించారు కార్యకర్తలు, నేతలు. అభిమాన నేతను కడసారి చూసుకుని భావోద్వేగానికి గురయ్యారు. కాగా, కోడెల పార్థీవ దేహం తీసుకొస్తున్న వాహనం వెంట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎంపీ కేశినేని నానితోపాటు పలువురు టీడీపీ నేతలున్నారు.

శివరాంపై తీవ్ర ఆరోపణలు
ఇది ఇలా ఉండగా, కాగా, కోడెల శివప్రసాదరావు బావమరిది కంచేటి సాయి ఆయన మరణంపై సంచలన ఆరోపణలు చేశారు. కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని కంచేటి సాయి ఆరోపించారు. అంతేగాక, ఈ మేరకు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. ఆస్తి కోసమే కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని సాయి ఆరోపించారు. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కోడెల తనకు ఫోన్ చేసి పలుమార్లు చెప్పారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications