మంగళగిరి టోల్ ప్లాజాలో భారీ అగ్ని ప్రమాదం: లారీ, క్యాష్ కౌంటర్లు పూర్తిగా దగ్ధం
గుంటూరు: జిల్లాలోని మంగళగిరి సమీపంలోని ఖాజా టోల్ ప్లాజా వద్ద గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారీని క్యాష్ కౌంటర్ వద్ద ఆపి టోల్ ఫీ చెల్లిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంతా చూస్తుండగానే మంటలు క్యాష్ కౌంటర్లకు వ్యాపించాయి.
వెంటనే అప్రమత్తమైన టోల్ ప్లాజా సిబ్బంది అక్కడ్నుంచి పరుగులు తీశారు. లారీ డ్రైవర్ కూడా వాహనం నుంచి దిగి దూరంగా పరుగెత్తాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. లారీ తమిళనాడుకు చెందినదిగా గుర్తించారు. లారీ టైర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రెండు క్యాష్ కౌంటర్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. కాగా, రూ. 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు టోల్ గేట్ నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రస్తుతం యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద రాకపోకలు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.












Click it and Unblock the Notifications