మండలి రద్దు మాటలు కాదు: భయపడేది లేదంటూ నారా లోకేష్, ‘గల్లా’ను కొడతారా? అంటూ ఫైర్
అమరావతి: శాసనమండలి రద్దు చేస్తామంటే తాము భయపడేది లేదని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళవారం మండలి ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. మండలి రద్దు కంటే అప్రజస్వామీకమేమీ ఉండదన్నారు. ఇది సాధ్యమయ్యే పనికాదని తెలిపారు.

భయపడేది లేదు..
రూల్ 71పై ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని లోకేష్ తెలిపారు. మండలి రద్దు చేస్తామంటే భయపడేది లేదని.. ఈ విషయంలో టీడీపీ సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మండలి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం మాత్రమే చెయ్యగలదని, తాము కూడా మండలిలో తీర్మానం చేస్తామని తెలిపారు.

అధికార పార్టీ నేతలే ఆందోళన..
గతంలో ఎప్పుడూ లేనివిధంగా 15 మంది మంత్రులు సభకు వచ్చారని, అధికార పార్టీ నేతలే ఇక్కడ ఆందోళన చేస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ జరుగుతున్న సందర్భంగా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

మిమ్మల్నేం చేయాలి జగన్..
కాగా, ‘రాజధాని విభజన వద్దు. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ మీద నిలబడమని నిలదీసినందుకు జైలుకి పంపుతారా? మరి మాట తప్పి, మడమ తిప్పిన మిమ్మల్ని ఏం చేయాలి జగన్ గారు' అంటూ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ మండిపడ్డారు.
ఒక ఎంపీని కొడతారా?
‘ఒక పార్లమెంటు సభ్యుడిగా జయదేవ్ గారి హక్కులు కాలరాసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? చేసిన తప్పులకు పోలీసులు సమాధానం చెప్పక తప్పదు. ఒక వ్యక్తి పై ఇంత కక్ష సాధింపు ఎందుకు వైఎస్ జగన్ గారు. గల్లా జయదేవ్ గారిని అరెస్ట్ చెయ్యడమే కాకుండా దారుణంగా హింసించారు. ఒక రోజు మొత్తం ఆయన్ని రోడ్ల పై తిప్పి వేధించారు.వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని లోకేష్ తెలిపారు.

మండలి రద్దుకు పార్లమెంటుకు వెళ్లాలి..
శాసనమండలి రద్దు అంత సులభం కాదని మండలిలో ప్రతిపక్ష నేత, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. మండలి రద్దు చేయాలంటే చాలా ప్రక్రియ ఉందని, మండలి రద్దు పార్లమెంట్ నిర్ణయంతోనే సాధ్యపడుతుందని తెలిపారు. ఇందుకు కనీసం ఏడాది సమయం పడుతుందన్నారు. సోమవారం అసెంబ్లీలో మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ రెండు బిల్లులను వైసీసీ సర్కారు మండలిలో ప్రవేశపెట్టింది. బిల్లుల ఆమోదం కోసం అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే.. టీడీపీ ఎమ్మెల్సీలు ఆ పక్రియను అడ్డుకుంటున్నారు.












Click it and Unblock the Notifications